2DG drug: కరోనా కమ్మేసిన వేళ..అందుబాటులోకి: త్వరలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ఇదివరకే అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన డ్రగ్ అది. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2DG) వైద్య అవసరాల కోసం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కొద్దిసేపటి కిందటే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీన్ని విడుదల చేశారు. ఈ డ్రగ్ను రక్షణశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ దీన్ని తయారు చేస్తోంది.
భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: ఈ నెలలో ఫస్ట్టైమ్ ఇంత తక్కువగా: మరణాల్లో మాత్రం అదే స్పీడ్
కేంద్రమంత్రుల చేతుల మీదుగా..
దేశ రాజధానిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈ డ్రగ్ను సాచెట్స్ను ఆవిష్కరించారు. తొలి పాకెట్ను తన మంత్రివర్గ సహచరుడు డాక్టర్ హర్షవర్ధన్కు అందజేశారు. అనంతరం హర్షవర్ధన్ మాట్లాడారు. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా ఈ డ్రగ్ను ఇవ్వడం వల్ల ఆక్సిజన్పై ఆధార పడాల్సిన పరిస్థితి తగ్గుతుందని అన్నారు. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని చెప్పారు. త్వరలోనే తాము దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు.
ట్రీట్మెంట్లో భాగంగా..
కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్ అందించే చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. ఆ పేషెంట్ త్వరగా కోలుకోవడంలో 2డీజీ డ్రగ్స్ కీలక పాత్ర పోషిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. రోగి శరీరంపై వేగవంతంగా పని చేస్తుందని క్లినికల్ ట్రయల్ ఫలితాల ద్వారా స్పష్టమైంది. అంటే ఈ మెడిసిన్ ఇవ్వగానే ఆక్సిజన్పై ఆధారపడటం తగ్గిపోతుంది. జెనరిక్ మోలిక్యూల్, గ్లూకోజ్ను పోలివుండే ఈ డ్రగ్ను క్లినికల్ ట్రయల్స్లో భాగంగా కరోనా సోకిన పేషెంట్లకు ఇవ్వగా..వారు తక్కువ సమయంలోనే కోలుకున్నారని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు.
పేషెంట్ శరీరంలోని వైరస్ను బలహీనపర్చేలా
గతేడాది ఏప్రిల్లో కరోనా తొలి వేవ్ సమయంలో ఇన్మాస్-డీఆర్డీఓ శాస్త్రవేత్తలు ల్యాబ్లో 2-డీజీ మెడిసిన్తో ప్రయోగాలు చేశారు. ఇందుకోసం హైదరాబాదులోని సీసీఎంబీ సహకారం కూడా తీసుకున్నారు. పేషెంట్ శరీరంలో వైరస్ మరింత బలపడటాన్ని ఈ మెడిసిన్ నియంత్రిస్తోందని గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగానే రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు గతేడాది మేలో డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. రెండోదశ క్లినికల్ ట్రయల్స్ అదే ఏడాది అక్టోబర్ వరకు కొనసాగాయి. కోవిడ్ -19 పేషెంట్లలో ఈ డ్రగ్ మంచి ఫలితాలను కనపర్చిందని నివేదించారు. రికవరీ కూడా చాలా వేగంగానే జరిగినట్లు నివేదికలో పొందుపర్చారు.
నీటిలో కలిపి..
2-డీజీ డ్రగ్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఓ చిన్న ప్యాకెట్లో ఇది లభిస్తుంది. నీటిలో కలిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్కు గురైన కణాలపై దాడి చేసి వైరస్ను నిర్మూలిస్తుంది. ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ను 220 మంది పేషెంట్లపై గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రయోగించారు. ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో మొత్తం 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగం చేశారు.