అనంతపురం కలెక్టర్గా ఇంటర్ బాలిక - గంధం చంద్రుడు చొరవకు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రశంస
దేశంలోనే తొలిసారిగా జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని అధికార బాధ్యతలను ఒకరోజుపాటు విద్యార్థినులకు అప్పగిస్తూ అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి కేంద్ర పెద్దల ప్రశంసలు లభించాయి. ఈనెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా.. 'బాలికే భవిష్యత్' ఇనిషేటివ్లో భాగంగా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి అనంతపురం జిల్లా కలెక్టర్ గా, ఇతర బాలికలు తహసీల్దార్లుగా, ఆర్ఐలుగా వ్యవహరించడం తెలిసిందే.
అనంతపురం కలెక్టర్గా ఇంటర్ విద్యార్థిని - 'బాలికే భవిష్యత్' అంటోన్న గంధం చంద్రుడు -దేశంలోనే వినూత్నం
జవదేకర్ ఏమన్నారంటే..
ఓ రైతు కూలీ బిడ్డ, 16 ఏళ్ల శ్రావణి అనంతపురం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రస్తావించారు. ఒక రోజు కలెక్టర్గా ఏదో నామమాత్రంగా కాకుండా, రెండు కీలక ఫైళ్లపై శ్రావణి సంతకాలు కూడా చేశారు. ఈ విషయాన్నే మంత్రి జవదేకర్ మంగళవారం ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు అధినేత్రులుగా అమ్మాయిలకు అవకాశం ఇస్తూ అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం అభినందనీయమంటూ న్యూ ఇండియా హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.
జిల్లా యంత్రాంగం హ్యాపీ..
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చేపట్టిన ‘బాలికే భవిష్యత్తు' కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ ప్రస్తావించడం, దీనిని న్యూ ఇండియాకు సంకేతంగా అభివర్ణించడంపై జిల్లా యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. తాము తలపెట్టిన వినూత్న కార్యక్రమంతో జాతీయస్థాయిలో విద్యార్థిని శ్రావణికి గుర్తింపు లభించిందని, బాలికలకు అత్యుత్తమ విద్య అందించడంతో పాటు, వారి జీవితాల్లో వెలుగులు పంచడంలో తామెప్పుడు ముందుంటామని అధికారులు తెలిపారు.
పండుగలా ‘బాలికే భవిష్యత్తు'
ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ‘‘మై వాయిస్, అవర్ ఈక్వల్ ఫ్యూచర్'' అనే థీమ్ తో నిర్వహించారు. ఆ సందర్భంగా అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు'పేరుతో కార్యక్రమాలను పండుగలా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో బాలికలు అధికారిణులుగా బాధ్యతలు చేపట్టినవేళ కేక్ కట్ చేశారు. రైతులకు, మహిళలకు తాము ఎలాంటి సేవలు చేయగలమో విద్యార్థినులు ప్రసంగాలు చేశారు. కొందరు ఫీల్డుకు వెళ్లి పనులను పరిశీలించారు. గతంలో కొవిడ్ నియంత్రణ చర్యల్లోనూ వినూత్న ఐడియాలు అమలు చేసిన కలెక్టర్ గంధం చంద్రుడు తాజాగా బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కేంద్రం మెప్పు పొందారు.
దివ్య హత్య కేసుపై జగన్ ఫోకస్ - సీఎంను కలిసిన మృతురాలి కుటుంబం - రూ.10 లక్షలు పరిహారం