జమ్మూ కాశ్మీర్, లడక్..రెండూ కేంద్ర పాలిత ప్రాంతాలే: అయినా..!
Recommended Video
న్యూఢిల్లీ: భారత దేశ చిత్రపటంలో కొత్తగా మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఇదివరకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా ఆవిర్భవించాయో గానీ.. దేశ యవనికపై కొత్తగా ఏర్పాటైన ఈ రెండింటి ఆవిర్భావం మాత్రం అనూహ్యం. ఏ మాత్రం ఊహించనివి. దేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసిన ఘట్టం. ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిందనే అపవాదును మూటగట్టుకున్న భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్.. ఎట్టకేలకు అఖండ భారతంలో విలీనం కావడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించడం, ఇన్నాళ్లు, ఇన్నేళ్లూ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగిన జమ్మూ కాశ్మీర్ ను విడగొట్టడం ఓ అద్భుత దృశ్యంగా అభివర్ణిస్తున్నారు దేశ ప్రజలు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రజా ప్రభుత్వం..
ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను రెండు ేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వల్ల ఆ రాష్ట్ర చిత్రపటం సమూలంగా మారిపోయింది. ఒకే రాష్ట్రంగా, భారత దేశానికి తలమానికంగా ఉంటూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ ఇక రెండుగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా.. లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రస్ఫూటిస్తాయి. ప్రజా ప్రతినిధులతో కూడిన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అంటే- పుదుచ్చేరి తరహాలో. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక అయిదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. మంత్రులు ఉంటారు. సొంత నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. సొంతగా చట్టాలను రూపొందించగలుగుతుంది. ప్రస్తుతం దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ.. ఢిల్లీ, పుదుచ్చేరిలకు మాత్రమే ముఖ్యమంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఉంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రజా ప్రతినిధులు లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్
లడక్.. ఇక పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండరు. ప్రభుత్వం ఉండదు. డయ్యూ, డామన్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, మాహె, చండీగఢ్ తరహాలో లడక్ లో పాలన ఏర్పడుతుంది. మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చుకుంటే.. లడక్ భౌగోళికంగా అత్యంత సంక్లిష్టమైనది. అత్యంత సున్నిత ప్రాంతం. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న కారణంగా ఇక్కడ లెప్టినెంట్ గవర్నర్ ను నియమించే అవకాశం ఉంది. లెప్టినెంట్ గవర్నర్ చేతుల్లో లడక్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటవుతుంది. జమ్మూ కాశ్మీర్ విభజనకు సంబంధించిన అపాయింట్ డే ఎప్పుడనేది ఇంకా నిర్దారించాల్సి ఉంది.
ప్రత్యేక మంత్రిత్వశాఖ?
లడక్ పాలనా వ్యవహారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయి. కేంద్రమే అన్నీ చూసుకుంటుంది. దీనికోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర పరిధిలో ఉన్న మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలకు మంత్రిత్వశాఖ లేదు. అయినప్పటికీ.. వాటిని, లడక్ ను ఒకే దృష్టితో చూడలేమని నిపుణులు చెబుతున్నారు. లడక్ సరిహద్దులో 50 శాతానికి పైగా చైనాతో సరిహద్దులను పంచుకుంటోంది. చైనా సైతం తరచూ సరిహద్దుల్లో సమస్యలను సృష్టిస్తూ వస్తోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. లడక్ భూభాగంపై అడుగు పెట్టి, దాన్ని తమదిగా చెబుతూ వస్తోంది. ఇలాంటి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి.. సాధారణ దృష్టితో చూడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. భౌగోళికంగా లడక్ కు ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
రెండుగా కాశ్మీరం..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు ఎకాఎకిన ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యను స్వాగతించారు.