చర్చలు విఫలం: సమ్మెకు సిద్దమైన బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్కు దిగనున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ నెలాఖరులో 48 గంటల పాటు బంద్కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ నిర్వహించనున్నారు.
బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విషయమై ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య కొంత కాలంగా చర్చలు సాగుతూనే ఉన్నాయి.ఈ విషయమై 2018 మార్చి 15న యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే ఈ విషయమై ఐబీఐ చర్చలు జరపడంతో బంద్ ను వాయిదా వేశాయి.
శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి.
2012 నవంబర్ 1న 10వ బిపర్టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది.
ప్రస్తుతం ఐబీఏ ఆఫర్చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు యూనియన్ నాయకులు ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి.అయితే బ్యాంకు యూనియన్ల డిమాండ్లపై ఐబీఏ ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.