అందమైన పూదోటలు... అరుదైన ప్రక్రుతి రమణీయత కేరళ సొంతం..!!
భారతదేశంలో అందమైన ప్రదేశాలు ఎక్కువగా ఉండే రాష్ట్రం కేరళ. కేరళలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలుకుతుంటుంది. ఎటు చూసినా పచ్చిక బయళ్లు, పక్షుల కిలకిలా రావాలు, జలపాతాల సవ్వడులు, రంగురంగుల పూదోటలతో ప్రక్రుతి రమణీయతను సంతరించుకుంటుంది. కేరళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం మంత్ర ముగ్దులను చేస్తుంది. అందుకే కేరళ రాష్ట్రాన్ని దేవుడి సొంతగడ్డగా అభివర్ణిస్తుంటారు.
కేరళ ప్రక్రుతి అందాలకు నీరాజనాలు పడుతున్న పర్యాటకులు..
600 కిలో మీటర్ల పొడవున విస్తరించిన అరేబియా మహాసముద్ర తీరం, అంతులేని స్వాంతనను అందించే విశాలమైన బ్యాక్ వాటర్స్, సుగంధ ద్రవ్యాలు, తేయాకులు, లేలేత కొబ్బరి నీళ్లు, ఆయుర్వేద చికిత్సలు.. వెరసి భూతల స్వర్గం కేరళగా ప్రఖ్యాతి గాంచింది. కనుచూపు మే విస్తరించిన పచ్చదనం, పోటీపడి పెరిగే కొబ్బరిచరెట్లు, నదీ ప్రవాహాలతో ఏడాదంతా పచ్చదనంతో విరాజిల్లే కేరళను జీవితంలో ఒక్కసారైనా సందర్శించి తీరాల్సి న ఉంటుంది.
యేడాదిపొడవునా అలరించే ప్రక్రుతి రమణీయత..
సంవత్సరం మొత్తం కూడా ఆహ్లాదకరమైన మరియు సమశీత వాతావరణంతో ఉండే కేరళ ఉష్ణమండల ప్రాంతం, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో తేలికగా విశ్రాంతి పొందవచ్చు. కేరళలో జూన్ నుంచి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు రుతుపవన కాలం మరియు ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవి కాలం ఉంటుంది, ఈ రెండు కాలాలే ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తాయి. సాధారణంగా ఉండే 28 డిగ్రీల నుంచి 32 ఉష్ణోగ్రతలతో పోలిస్తే శీతాకాలంలో ఉష్ణోగ్రత కాస్తంత తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం అతిధులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులకు..పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. కేరళలోని ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త కళ సంతరించుకుంది.
అరుదైన పూదోటలు కేరళ సొంతం..
పన్నెండు సంవత్సరాలకు ఓ సారి వచ్చే అరుదైన..అందమైన పూలు ఇప్పుడు మున్నార్ కొండలను కప్పేశాయి. అచ్చం దుప్పటి పరిచినట్లు కొండల నిండా అవే పూలు. మెజెంటా రంగులో ఎక్కడ చూసినా ఇవే పూలు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. గతంలో 2006లో ఈ పూల పండగ వచ్చిన సమయంలోనూ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున సందర్శించారు. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఈ అరుదైన ప్రకృతి సోయగాన్ని వీక్షించేందుకు ప్రతి రోజూ వేలాదిగా ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. మున్నార్ కు సమీపంలోని అనామలై హిల్స్ ప్రాంతంలో ఈ సుందర దృశ్యాన్ని వీక్షించవచ్చు. అక్టోబర్ వరకూ ఈ ఆకర్శణీయమైన పూల సందడి కొనసాగనుంది.
అందుకే దేవుడి సొంత గడ్డగా ప్రసిద్దిగాంచిన కేరళ..
రంగు రంగుల రంగవళ్లులను మరింపించే రకరకాల పూలు మంత్ర ముగ్దులను చేస్తుంటాయి. అద్భుతమైన ప్రకృతి సోయగాన్ని వీక్షించేందుకు ఈ ఆగస్టు నెల ఉత్తమమైన సమయం అని చెబుతున్నారు. ఏకంగా మూడు వేల హెక్టార్లలో ఈ వినూత్న పూల సందడి ఉంటుంది. ఈ పూల చెట్లకు ఓ ప్రత్యేకత కూడా ఉంటుంది. ఓ సారి పూలు పూసిన తర్వాత అవి అంతరించిపోతాయి. తిరిగి మళ్లీ ఈ పూల చెట్లు రావాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ వచ్చింది. అవకాశం, అభిరుచి ఉన్న వాళ్లు మున్నార్ వెళితే ఈ అందమైన దృశ్యాలను వీక్షించొచ్చు. పన్నెండు సంవత్సరాలకు ఓ సారి వచ్చే అరుదైన ఇలాంటి దృశ్యాన్ని చూసి తరించాల్సిందే అంటున్నారు ప్రక్రుతి ప్రేమికులు.