125 కోట్లమంది చేతుల్లో ఆధార్: తొమ్మిదేళ్లలో 36 వేల కోట్ల సార్లు వినియోగం: రికార్డులు బ్రేక్.. !
న్యూఢిల్లీ: ఆధార్. దేశాన్నేలే పాలకులు మొదలుకుని.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆధారంగా మారిన గుర్తింపు కార్డు ఇది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటుపరంగా ఏ చిన్న పని అయినా ఈ కార్డు మీదే ఆధారపడి కొనసాగుతోంది. అందుకే- ఓ అరుదైన రికార్డును సాధించింది. తొమ్మిదేళ్ల వ్యవధిలో 36 వేల కోట్ల సార్లు ఈ కార్డును మనదేశ ప్రజలు వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు కార్యకలాపాల కోసం వినియోగించారు.
125 కోట్ల మందికి జారీ..
దేశంలో 2010లో కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యుపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. సాఫ్ట్ వేర్ దిగ్గజం నందన్ నీలేకనికి దీని బాధ్యతలను అప్పగించింది. నందన్ నీలేకని సారథ్యంలో ఆధార్ కార్డు ప్రాజెక్టు రూపుదాల్చింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా భారత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యుఐడీఏఐ) కార్యకలాపాలను ప్రారంభించింది. ఆధార్ కార్డును వినియోగంలోకి తీసుకొని వచ్చినప్పటిన తరువాత ఈ తొమ్మిదేళ్ల కాలంలో మొత్తం 125 కోట్ల మందికి జారీ చేశారు.
99 శాతం మందికి..
ఆధార్ కార్డును అమల్లోకి తీసుకుని వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అధికారులు ఓ నివేదికను విడుదల చేశారు. దేశ జనాభాలో దాదాపు 98 శాతం మందికి ఆధార్ కార్డును జారీ చేసినట్లు పేర్కొన్నారు. 125 కోట్ల మంది ప్రజలకు 12 అంకెల యూనిక్ ఐడీ నంబర్ ను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఇంకా లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉందని, ఆ దిశగా తమ కాార్యకలాపాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
37 వేల కోట్ల సార్లు..
ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆధార్ కార్డుదారులు 37 వేల కోట్ల సార్లు దీన్ని వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు మొదలుకుని బ్యాంకుల్లో ఖాతాలను తెరవడానికి, వాహనాల కొనుగోలు వంటి అన్ని రకాల లావాదేవీల్లోనూ ఆధార్ కార్డు వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫలితంగా- రికార్డు స్థాయిలో ఈ కార్డులపై లావాదేవీలు నమోదయ్యాయి. ప్రభుత్వ పథకాలను లబ్ది పొందే వారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రోజూ నాలుగు లక్షల మేర విజ్ఞప్తులు..
ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వరకు మార్పులు, చేర్పుల కోసం విజ్ఞప్తులు అందుతున్నాయని తెలిపారు. చిరునామాల మార్పు కోసం అత్యధికంగా విజ్ఞప్తులు అందుతున్నాయని అన్నారు. కార్డుదారుల నుంచి లక్షల సంఖ్యలో అందుతోన్న విజ్ఞప్తులకు అనుగుణంగా, నిర్దేశిత గడువులోగా వాటిని సరి చేస్తున్నామని, దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.