బెంగళూరు నడి రోడ్డులో భారీ గుంత: సముద్రం, సాగరకన్య ప్రత్యక్షం, వరైటీ నిరసన (వీడియో)!
బెంగళూరు: బెంగళూరు నగరంలో గత రెండు వారాల నుంచి ప్రతి రోజూ భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో నాసికరకం రోడ్లు గుంతల మయం అయ్యాయి. ప్రతి రోజు వాహన చోదకులు గుంత రోడ్లలో వాహనాలు నడపలేక నానా ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పటి వరకు ఐదు మంది ప్రాణాలు వదిలారు.
కొన్ని ప్రాంతాల్లో భారీ గుంతలు పడి అడుగుల లోతుల్లో వర్షం నీరు నిలిచిపోయింది. బీబీఎంపీ అధికారులు గుంతలు పూడ్చి రోడ్లు మరమత్తులు చెయ్యడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపణలు వచ్చాయి. బీబీఎంపీ అధికారులు, సిబ్బంది నిర్లక్షానికి ఐదు రోజుల్లో ఐదు మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడమే సాక్షం. బెంగళూరు నగరంలో 15 వేల గుంతలు ఉన్నాయని స్వయంగా బీబీఎంపీ అధికారులే చెప్పారు.
బెంగళూరు సిటీ పరువు!
ప్రముఖ కళాకారుడు (చిత్రకారుడు) బాదల్ నంజుండస్వామి బెంగళూరు నగరంలో రోడ్ల మీద ఎక్కడ గుంతలు కనపడినా తన ప్రతిభతో వింతవింత బోమ్మలు వేసి నిద్రపోతున్న అధికారులకు చుక్కలు చూపిస్తుంటాడు. రోడ్ల మీద వేసిన చిత్రాలు చూసిన ప్రజలు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చెయ్యడం, వెంటనే అధికారులు ఆ రోడ్ల మరమ్మత్తులు చెయ్యడం జరుగుతోంది.
బెంగళూరు సిటీలో!
బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే కామరాజ రోడ్డు- కబ్బన్ రోడ్డు జంక్షన్ లో నాలుగైదు అడుగుల భారీ గుంత పడింది. వర్షం నీటితో ఆప్రాంతం జలమయం అయ్యింది. గురువారం అటు వైపు వెలుుతున్న బాదల్ నంజుండస్వామి విషయం గుర్తించాడు.
ప్రముఖ నటి సోనూగౌడ
శుక్రవారం బాదల్ నంజుండస్వామి ప్రముఖ కన్నడ నటి సోనూ గౌడను భారీ గుంత ఉన్న ప్రాంతానికి పిలుచుకుని వచ్చాడు. తరువాత తన నైపుణ్యంతో వర్షం నీటిని అచ్చం సముద్రం నీరులాగా మార్చేశాడు. నటి సోనూ గౌడకు సాగరకన్య డ్రస్ వేయించి అక్కడ కుర్చోపెట్టాడు.
నీటిలో నటి సోనూ గౌడ
సాగరకన్య దుస్తులు వేసుకున్న సోనూ గౌడ వర్షం నీరు ఉన్న చోట కుర్చుని చేతితో నీళ్లు ఎత్తుకుని రోడ్డు మీద చల్లుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద గుంత పడినా అధికారులు నిర్లక్షంగా కొన్ని రోజుల నుంచి ఇలాగే వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారిన బాదల్ నంజుండస్వామి ఆరోపించారు.
దుమ్మెత్తి పోసిన ప్రజలు
నటి సోనూ గౌడ, బాదల్ నంజుండస్వామికి మద్దతుగా పలువురు ప్రజలు అక్కడ ప్రభుత్వం, బీబీఎంపీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. విషయం తెలుసుకున్న బెంగళూరు నగర ఇన్ చార్జ్ మంత్రి కేజే. జార్జ్ ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడ్డారని తెలిసింది.