మీ వెంటే: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, దాడుల గురించి అమెరికాకు చెప్పాం.. సుష్మాస్వరాజ్
న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు కేంద్రానికి అండగా నిలబడ్డాయి.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు తీసుకునే అన్ని చర్యలకు తాము సంపూర్ణ మద్దతిస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులను తాము అభినందిస్తున్నామని, ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు మన సైనికులు తీసుకునే ఏ చర్యకైనా తాము పూర్తిగా మద్దతిస్తామని, ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకుండా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దళాలు దాడి జరిపిన తీరు అద్భుతమని ఆజాద్ అన్నారు.
#WATCH EAM Sushma Swaraj after all party meeting: I am happy that all parties in one voice praised the security forces and supported the Govt's anti-terror operations. pic.twitter.com/AOaIhMIDln
— ANI (@ANI) February 26, 2019
అన్ని పార్టీలు ఒకేమాట మీద నిలబడి ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం, భద్రతా బలగాలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అన్ని పార్టీల నేతలు భారత వైమానిక దళాన్ని ప్రశంసించాయని సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరకేకంగా అందరూ ఏకమవ్వాలన్నారు. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ చేపట్టిన దాడుల గురించి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైకేల్ పాంపియోతో పాటు పలు దేశాల నేతలకు వివరించినట్లు ఆమె ఈ సమావేశంలో తెలిపారు.
అఖిలపక్ష భేటీకి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ తరఫున గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. అన్ని పార్టీలు ఏకతాటి పైకి రావడం సంతోషకరమని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.