పఠాన్కోట్ ఉగ్ర దాడి మా పనే: యూజేసీ
శ్రీనగర్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ వైమానికి స్థావరంపై జరిగిన ఉగ్ర దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ ప్రేరేపిత యూనైటెడ్ జిహాద్ కౌన్సిల్(యూజేసీ) ప్రకటించుకుంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ హైవే స్కాడ్తో అనుబంధం ఉన్న ఐక్య జిహాది మండలి పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి దిగినట్లు పేర్కొంది.
కాశ్మీర్లో టెర్రర్ గ్రూపులను ప్రోత్సహిస్తున్న పాకిస్థానే యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ కూడా మద్దతు ఇస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి యూజేసి తమ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఉగ్రవాది సయిద్ సలాహుద్దిన్ ఆ సంస్థకు చీఫ్గా ఉన్నాడు.
‘భారత ప్రభుత్వం, మీడియాకు పాకిస్థాన్ ఫోబియా పట్టుకుంది. భారత్లో ఏ దాడి జరిగినా పాకిస్థానే అందుకు కారణమని చెబుతున్నారు. కాశ్మీర్ కోసమే మా పోరాటం' అని యూజేసీ అధికార ప్రతినిధి సయ్యద సదాకత్ హుస్సేన్ చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం యూజేసీ ప్రకటనను కొట్టిపారేసింది.
పఠాన్కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్బేస్లో విధ్వంసం సృష్టించడం లక్ష్యంగానే దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులను భద్రతా దళాలు సమర్థంగా ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్బేస్ సురక్షితంగా ఉందని.. ఏమీ ధ్వంసం కాలేదని అధికారులు తెలిపారు.