ఈవీఎం అక్రమాలపై విపక్షాల నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వీటిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈవీఎంల పరిశీలనకు విపక్షపార్టీలకు చెందిన నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మమతా బెనర్జీ వివరించారు. ఈవీఎంల పనితీరును పరిశీలించి, ట్యాంపరింగ్కు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కమిటీ పలు సూచనలు చేస్తుంది. అంతేకాదు ఎన్నికల సంస్కరణలు కూడా ఎన్నికల సంఘానికి సూచించనుంది నలుగురు సభ్యుల కమిటీ.
నలుగురు విపక్ష పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు
శనివారం జరిగిన మెగా ర్యాలీ తర్వాత దేశంలోని 14 పార్టీలకు చెందిన విపక్ష నేతలతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో చర్చించిన అంశాలను అమె చెప్పారు. ఇక నలుగురు సభ్యుల కమిటీలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సతీష్ మిశ్రా, ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల సంఘానికి వీవీప్యాట్లపై అవగాహన కల్పించడాన్ని, ఈవీఎంలు దుర్వినియోగం కాకకుండా చర్యలు తీసుకోవడంపై సూచనలు చేస్తారని మమత వివరించారు.
ప్రజా మేనిఫెస్టో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండనున్నాయో తెలుసా..?
ఈవీఎంలు వద్దు... బ్యాలట్ విధానమే ముద్దు
ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే ఈవీఎంలకు స్వస్తి పలికి పాతపద్ధతైన బ్యాలట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఎన్సీ ఛీఫ్ ఫరూక్ అబ్దుల్లా మెగార్యాలీ సందర్భంగా అన్నారు. ప్రపంచ దేశాలు కూడా బ్యాలట్ విధానాన్నే వినియోగిస్తున్నాయని ఏవీ ఈవీఎంలు వాడటం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. విపక్షాలు ఎన్నికల సంఘం రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చి ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేసి బ్యాలట్ విధానం తిరిగి అమలు చేయాలని కోరుదామని అబ్దుల్లా వెల్లడించారు. సమయం తక్కువగా ఉన్నందున కమిటీ సభ్యులు వెంటనే సూచనలు ఇవ్వడం ప్రారంభించాలని తాను కోరుతున్నట్లు అబ్దుల్లా తెలిపారు. ప్రజాస్వామ్యంను పరిరక్షించాలంటే వెంటనే బ్యాలట్ విధానంను అమలు చేయాలని ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఎన్నికలు సక్రమంగా జరగాలన్నదే తమ తపన అని మోసపూరితమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు.
ప్రపంచ దేశాలు కూడా బ్యాలట్ విధానంతోనే ఓటింగ్ నిర్వహిస్తున్నాయి
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో తాము ఈవీఎంలను బహిష్కరించాల్సిందిగా కోరడం లేదని కాకపోతే ఈవీఎంలు ట్యాపరింగ్ కాకుండా చూడాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తెలిపారు. ఇప్పటికే యూరప్లోని నాలుగు దేశాలు ఈవీఎంలను వినియోగించడం మానేసి బ్యాలట్ ఓటింగ్ విధానం తిరిగి అమలు చేస్తున్నాయని సింఘ్వీ గుర్తుచేశారు. ఈ మధ్య జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయనే వార్తలు వచ్చాయని దీన్ని దృష్టిలో ఉంచుకునే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు. అందుకే ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.