అమెరికన్ సీల్స్ చేయలేనిది.. మనం ఎందుకు చేయలేం: 24 గంటల్లో ఏదైనా జరగొచ్చు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ యుద్ధం ఖాయం అనేలా ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కరోజులో ఏదైనా జరగొచ్చు అని ప్రకటించారు. పాకిస్తాన్ కు చెందిన మూడు జెట్ ఫైటర్లు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి, రాజౌరీ సెక్టార్ లో బాంబులు వేసిన ఘటన అనంతరం అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి అమెరికాకు చెందిన నేవీ సీల్స్ బలగాలు పాకిస్తాన్ లోకి చొచ్చుకు వెళ్లాయని గుర్తుచేశారు. అబోట్టాబాద్ లో లాడెన్ ఇంటిని, స్థావరాన్ని చుట్టుముట్టి, అతణ్ని కాల్చి చంపాయని, అదే పని మనం ఎందుకు చేయలేమని ప్రశ్నించారు. అమెరికా నేవీ సీల్స్ చేసిన పనిని, మనం చేయలేమా? ఎందుకు చేయలేం అనే విషయంపై ఆలోచిస్తున్నాం. ఈ రోజు (బుధవారం) ఏదైనా జరగొచ్చు. యుఎస్ నేవీ సీల్స్ తరహాలో మనమూ చేయగలం.. అని అరుణ్ జైట్లీ చెప్పారు. 24 గంటల వ్యవధిలోనే అమెరికన్ నేవీ సీల్స్ కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ ను అంతం చేశాయని, అలా 24 గంటల్లో తాము కూడా ఏదైనా చేయగలమని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు.
రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉందని చెప్పారు. వారంరోజుల పాటు రాజకీయాలు మాట్లాడుకోవచ్చని, సైనిక చర్య తీసుకోవడానికి ఒక్కరోజు చాలు అని జైట్లీ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత దేశ ప్రజలు అంతా తమ వెంటే ఉన్నారని, సైనిక చర్య కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు క్షీణించినట్టేనని అన్నారు. దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ దేనని, తమది కాదని అన్నారు. యుద్ధాన్ని నివారించడానికి తాము ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ, పాక్ ప్రతిక్షణం తమను రెచ్చగొడుతూనే ఉందని, పుల్వామా దాడి ఇందులో భాగమేనని చెప్పారు.