పీఎన్బీ స్కాం: రాజకీయ నాయకులేనా?.. రెగ్యులేటర్లు జవాబుదారీ కారా?: అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : వ్యాపారాల్లో అనైతికతకు తెరపడాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆకాంక్షించారు. రుణదాతలు - రుణ గ్రహీతల మధ్య అనైతిక వ్యవహారాలు అంతమవ్వాలని శనివారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2018లో మాట్లాడుతూ చెప్పారు. నైతిక నిష్ఠతో వ్యాపారం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.
రెగ్యులేటర్లకు చాలా ముఖ్యమైన విధులు ఉన్నాయని, నిబంధనలను అంతిమంగా నిర్ణయించేది వారేనని, వారికి మూడో కన్ను ఉండాలని, దానిని ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ మన దేశ వ్యవస్థలో రాజకీయ నాయకులు మాత్రమే జవాబుదారులని, రెగ్యులేటర్లు ఎందుకు జవాబుదారులు కాదని ఆయన ప్రశ్నించారు.
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలే అధికం...
పీఎన్బీ స్కాంను ప్రస్తావిస్తూ.. ఇటువంటి ఘటనల ప్రభావం దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేస్తున్న కేసులు.. వ్యాపార వైఫల్యం, బ్యాకు మోసాల కేసుల కన్నా ఎక్కువగా ఉంటున్నాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థపై ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు.
ఎవరూ ఎర్రజెండా చూపించకపోతే ఎలా?
బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక శాఖల్లో మోసాలు జరుగుతూ ఉంటే, ఎవరూ ఎర్ర జెండా చూపించకపోతే, ఏ దేశానికైనా అటువంటి పరిస్థితి ఆందోళనకరం కాదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా ఉదాసీనత ప్రదర్శించే అత్యున్నత స్థాయి మేనేజ్మెంట్, మరోవైపు చూసే బహుళ అంచెల ఆడిటింగ్ సిస్టమ్ వల్ల ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ సాధ్యం కాదు...
బ్యాంకుల ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. వివిధ రాజకీయ కారణాల రీత్యా అది సాధ్యపడదని వ్యాఖ్యానించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం అనంతరం చాలామంది బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారని, కానీ అది పూర్తి రాజకీయ సంఘర్షణతో కూడిన వ్యవహారమని వ్యాఖ్యానించారు. దీనికోసం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాలను సవరించాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రైవేటీకరణే సరైన మందు: ఫిక్కీ అధ్యక్షుడు
‘నా ఉద్దేశం ప్రకారం ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యపడదు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయం' అని జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఫిక్కీ అధ్యక్షుడు రాశేశ్ షా మాట్లాడుతూ రెండు, మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహా మిగతా వాటిని ఒక క్రమపద్దతిలో ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని ఇది వరకే కేంద్రమంత్రి అరుణ్జైట్లీతో మాట్లాడానని అన్నారు.
ప్రైవేటీకరణ ఒక రకంగా మంచిదే: ఆది గోద్రెజ్
ఈ అంశంపై అసోచామ్ పారిశ్రామిక వర్గాలు కూడా గొంతు కలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్ని 50 శాతానికి కుదిస్తే స్టాక్హోల్డర్స్, డిపాజిట్దారులకు ప్రాముఖ్యానిచ్చి పనిలో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో అవినీతి బాగోతాలు లేవని, ఉన్నా తక్కువ స్థాయిలోనే ఉండటంతో బ్యాంకుల ప్రైవేటీకరణ ఒక రకంగా మంచిదేనని ప్రముఖ వ్యాపారవేత్త ఆది గోద్రెజ్ వ్యాఖ్యానించారు. రాహుల్ బజాజ్ సైతం దీనికి మద్దతు తెలిపారు.