Unlock 4.0: మెట్రో సేవల పునరుద్ధరణ!, స్కూల్స్, కాలేజీలు బంద్, బార్లు ఓపెన్ కానీ..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా వీటిని ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
మెట్రో సేవలు పునరుద్ధరణకు..
ఆగస్టు 31తో అన్లాక్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో 4.0కు సంబంధించి కొత్త నియమ నిబంధనలపై ఇప్పటికే ఆ శాఖ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సేవలను అనుమతించాలన్న ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
బార్లలో మద్యం అమ్మకాలకు ఓకే కానీ.. స్కూల్స్, కాలేజీలు బంద్..
అంతేగాక, మరికొన్ని ప్రజా రవాణా, ఇతర సేవలను అనుమతించే సూచనలున్నాయి. అయితే, పాఠశాలలు, కళాశాలలు మాత్రం ప్రస్తుతం ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే బార్లను తెరవకుండా కేవలం మద్యాన్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
మెట్రో సేవలు ప్రారంభించాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
కరోనా మహమ్మారి కారణంగా మెట్రో సేవలను దేశ వ్యాప్తంగా మార్చి నెల నుంచి నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో సేవలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో కరోనా నియంత్రణలోనే ఉందని, అందుకే ఇప్పుడు మెట్రో సేవనలను తిరిగి ప్రారంభించాలని కోరారు. కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆకాంక్షించారు.
ఢిల్లీ మెట్రోకు 1300 కోట్ల నష్టం..
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు సేవలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేందుకు మార్గదర్శకాలను కూడా రూపొందిస్తున్నారు. మెట్రో రైలు సేవలు నిలిచిపోయిన నాటి నుంచి సుమారు రూ. 1300 కోట్లు నష్టపోయినట్లు ఢిల్లీ మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే దశలవారీగా అనేక సేవలను పునరుద్దరించిన విషయం తెలిసిందే. విమాన, రైలు సేవలు మినహా ప్రజా రవాణా పురద్దరణ జరిగింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా పెరుగుతుండటంతో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసేందుకు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి.