ఇంట్రెస్టింగ్ : ప్రధాని రేసులో మొత్తం అవివాహితులే
దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు సొంత వ్యూహ రచనలు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలతో మహాకూటమి ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ కోరికగా ఉంది. ఇక ఈసారి మాత్రం ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది చాలా ఆసక్తి కరంగా మారింది. బీజేపీ నుంచి మోడీనే మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ఉండనుండగా... మహాకూటమి నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఏంటా ప్రత్యేకత ఏమా కథ..?
ఐదవ లిస్టు విడుదల: పట్టణంతిట్ట అభ్యర్థిని ఫైనల్ చేసిన బీజేపీ...తెలంగాణలో ఆరు సీట్లు ప్రకటన
మహాకూటమి వస్తే అవివాహితులే ప్రధాని
మరో కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు అవుతున్నాయి. ఇక రాష్ట్రాల సంగతి అటుంచితే దేశాన్ని మాత్రం ఎవరు ఏలుతారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశంలోని బీజేపీయేతర పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు. ఇక మహాకూటమిలోనే చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధానిగా ఉంటారనేదానిపై స్పష్టత లేదు.
పీఎం పోస్టుపై కన్నేసిన రాహుల్, మమతా, మాయావతి
మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి. వీరందరిలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తోంది. అందరూ అవివాహితులే. అయితే ప్రధాని కావాలనే తమ కోరిక నెరవేర్చుకునేందుకు అంగీకరిస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే మాయావతి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పి మహాకూటమికి షాక్ ఇచ్చింది. ఇక మమతా బెనర్జీ కూడా కేంద్రంలో చక్రం తిప్పేందుకు తన వంతు కృషి చేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైన పర్యటనలకు వెళ్లినప్పుడు లేదా విద్యార్థులతో సమావేశమైనప్పుడు కచ్చితంగా తాను ఎదుర్కొనే ప్రశ్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని... ఈ ప్రశ్న వేయగానే రాహుల్ సిగ్గుపడిపోవడం చాలా సార్లు చూశాం.
ఇంతకుముందు కూడా దేశాన్ని ఏలిన బ్రహ్మచారులు
ఇక ప్రస్తుతం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయన బ్రహ్మచారి జీవితమే గడుపుతున్నారు. ఒకప్పుడు దేశాన్ని పాలించిన అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఆజన్మ బ్రహ్మచారిగానే ఉన్నారు. మరోవైపు రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కూడా బ్రహ్మచారిగానే ఉన్నారు. ఇక బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పటికీ బ్రహ్మచారే. అన్నాడీఎంకే దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా వివాహం చేసుకోలేదు. ఇటు తమిళ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఆమె తనదైన ముద్రవేసింది.
మొత్తానికి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే దేశానికి మళ్లీ ఒక బ్యాచిలర్ ప్రధానిగా వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.