ఉన్నావ్ రేప్:'కనీసం నీళ్ళివ్వడం లేదు', 'దోషిగా తేలితే కుటుంబం ఆత్మహత్య'
Recommended Video
లక్నో:హోటల్గది నుండి తమను బయటకు రానివ్వడం లేదని, కనీసం తాగడానికి కూడ మంచినీళ్ళు ఇవ్వడం లేదని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేపింది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ను ఉన్నావ్ అత్యాచార కేసు ప్రస్తుతం ఇబ్బందులు పెడుతోంది. ఈ కేసు విషయమై ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శల్లో ముంచెత్తుతున్నాయి. ఆదివారం నాడు బాధితురాలు తన కుటుంబంతో వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాధిత కుటుంబం ధర్నాకు దిగారు. ఆ మరునాడే బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది.
దీంతో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం హోటల్రూమ్లో ఉంచింది. అయితే తమను ఆ రూమ్లో ఖైదీల మాదిరిగా ఉంచారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి నీళ్ళు అడిగినా ఇవ్వడం లేదన్నారు.
తమ గది చుట్టూ పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. అయితే తాము ఏదైనా అడిగితే తమ పని కాదన్నట్టుగా పోలీసులు చెబుతున్నారని బాధితురాలు ఆవేదిన వ్యక్తం చేశారు. ఎవరితో కూడ మాట్లాడనివ్వడం లేదన్నారు. కనీసం తన ఫోన్ను కూడ చార్జీంగ్ పెట్టుకోకుండా అడ్డుపడుతున్నారని ఆమె చెప్పారు.
ఆరోపణలన్నీ తప్పు, రాజకీయ కుట్రలోనే భాగం: ఎమ్మెల్యే భార్య
తన భర్తతో పాటు మరికొందరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎమ్మెల్యే సతీమణి ఖండించారు. రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలుగా ఆమె అభివర్ణించారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎమ్మెల్యే భార్య ఇవాళ ఉత్తర్ప్రదేశ్ డీజీపీని కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తన భర్తను మీడియా దోషిగా చిత్రీకరించిందన్నారు. గది నుండి ఆయన బయటకు కూడ రావడం లేదన్నారు. ఆరోపణలు కాదు, వాస్తవాలను తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. తన భర్త దోషిగా తేలితే తమ కుటంబం ఆత్మహత్య చేసుకొంటామని ఆమె హెచ్చరించారు.