ఉన్నావ్ : వీడిన బాలికల హత్య కేసు మిస్టరీ... చంపింది 'లంబు'.. అదే కారణం...
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం,మరో బాలిక అపస్మారక స్థితిలో కనిపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. బాలికల మృతికి విష ప్రయోగమే కారణమని పోలీసులు నిర్దారించారు. ముగ్గురు బాలికల్లో ఒక బాలిక పట్ల మనసుపడ్డ ఓ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన ఆ యువకుడు అసలు నిజాలను బయటపెట్టాడు.
అసలేం జరిగింది..
పోలీసుల కథనం ప్రకారం... ఉన్నావ్ జిల్లాలోని పథక్పూర్కి చెందిన ఆ ముగ్గురు బాలికలు అక్కాచెల్లెళ్లు. అదే గ్రామంలో వారికి కొంత వ్యవసాయ భూమి ఉంది. వీరి వ్యవసాయ భూమిని ఆనుకుని వినయ్ అలియాస్ లంబు అనే యువకుడి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి ఉంది. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు తరుచూ తమ పంట పొలం వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో లాక్డౌన్ సమయంలో తమ పక్క పొలానికి చెందిన వినయ్తో వారికి పరిచయం ఏర్పడింది.
వినయ్ వన్ సైడ్ లవ్...
వినయ్తో పరిచయం రీత్యా ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పంట పొలం వద్దకు వెళ్లినప్పుడు అతనితో మాట్లాడేవారు. స్నాక్స్ తింటూ ముచ్చట్లు చెప్పుకునేవారు. అలా కొద్దిరోజులకు వినయ్ ఆ ముగ్గురు బాలికల్లో ఒక బాలికను వినయ్ ఇష్టపడటం మొదలుపెట్టాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేశాడు.అయితే అందుకు ఆమె తిరస్కరించడంతో అప్పటినుంచి కక్ష పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
వాటర్ బాటిల్లో పురుగుల మందు కలిపి...
బాలికను హత్య చేసేందుకు వినయ్ ప్రీప్లాన్తో సిద్దమయ్యాడు. పురుగుల మందు కొని ఒక వాటర్ బాటిల్లో దాన్ని కలిపాడు. కొన్ని స్నాక్స్,ఆ వాటర్ బాటిల్ పట్టుకుని ఎప్పటిలాగే పొలం వద్దకు వెళ్లాడు. తనతో పాటు మరో మైనర్ బాలుడిని కూడా తీసుకెళ్లాడు. అప్పటికే ఆ ముగ్గురు బాలికలు కూడా కొన్ని స్నాక్స్ తీసుకొని అక్కడికి వచ్చారు. అంతా కలిసి స్నాక్స్ తింటున్న సమయంలో... తన ప్రేమను తిరస్కరించిన యువతికి వినయ్ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆమె కొన్ని నీళ్లు తాగాక.. మిగతా ఇద్దరు బాటిల్ లాక్కుని మిగిలిన నీళ్లు తాగేశారు. తనను కాదన్న బాలికను మాత్రమే చంపాలనుకున్న వినయ్... మిగతా ఇద్దరు కూడా విషం కలిపిన నీళ్లు తాగడంతో షాక్ తిన్నాడు.
ఇద్దరు మృతి... మరొకరి పరిస్థితి విషమం...
ఆ తర్వాత కొద్దిసేపటికే నురుసులు కక్కుతూ ముగ్గురు బాలికలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వినయ్,అతనితో పాటు ఉన్న మరో మైనర్ బాలుడు అక్కడినుంచి పరారయ్యారు. ముగ్గురిలో ఇద్దరు బాలికలు మృతి చెందగా... వినయ్ ప్రేమించిన బాలిక ప్రస్తుతం కాన్పూర్ ఆస్పత్రిలో చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు వినయ్ కాల్ డేటా ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. బాలికల హత్య జరిగిన సమయంలో అతని సెల్ఫోన్ సిగ్నల్ అక్కడే నమోదైనట్లు గుర్తించారు. నిందితులను ఉరితీయాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.