ఉన్నావ్: ఇద్దరు బాలికల హత్య కేసులో ట్విస్ట్ -విషప్రయోగం? -పోలీస్ పహారాలో అంత్యక్రియలు పూర్తి
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యం ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. పశువులను మేపడానికి వెళ్లిన ముగ్గురు బాలికలు.. చేతులు కాళ్లూ కట్టేసిన స్థితిలో కనిపించగా, అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో బాలిక కాన్పూర్ ఆస్పత్రిలో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. బాలికల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. ఆ ముగ్గురిపైనా విషప్రయోగం జరిగినట్లు తాజాగా వెల్లడైంది. మరోవైపు ఇద్దరు బాలికల అంత్యక్రియలు శుక్రవారమే పూర్తయ్యాయి..
అసలేం జరగిందంటే..
ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృతదేహాలు లభించాయి. అదే ప్రదేశంలో కనిపించిన మరో 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం ఉదయం పశువులు కాసేందుకు వెళ్లిన ఈ ముగ్గురూ ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో గాలించగా, కాళ్లు, చేతులు వాళ్ల దుస్తులతోనే కట్టేసి ఉన్న స్థితిలో విగతజీవులుగా కనిపించారు. 17, 16 సంవత్సరాల బాలికలిద్దరూ అక్కాచెల్లెళ్లుకాగా, 13 సంవత్సరాల బాలిక వారి బంధువు. ఈ కిరాతక ఘటన ఉన్నావ్ తోపాటు ఉత్తరప్రదేశ్ అంతటా కలకలం రేపింది. దీనిపై..
విషప్రయోగం చేశారా?
కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. చనిపోయిన ఇద్దరి మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ ఇద్దరు బాలికల శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేకపోవడంతో మరణాను కనిపెట్టడం కష్టతరమైంది. కాగా, పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. విషంప్రయోగం వల్లే బాలికలు చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాన్పూర్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న బాలికను కూడా విషప్రయోగం కేసుగానే డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. కాగా,
దర్యాప్తు కోసం 6 టీమ్స్
ఉన్నావ్ జిల్లా, అసోహా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు దళిత బాలికపై కిరాతకం, అందులో ఇద్దరి మరణం ఘటనపై ఉత్తరప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యోగి సర్కారు ఈ కేసు దర్యాప్తు కోసం మొత్తం ఆరు బృందాలను రంగంలోకి దించింది. 'గుర్తుతెలియని వ్యక్తులు చేసిన హత్యలుగా' దీనిని పోలీసులు భావిస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తులో అలసత్వం నెలకొందంటూ పలు దళిత సంఘాలు ఆందోళనలను జరుపుతున్నాయి. ఇదిలా ఉంటే..
ముగిసిన అంత్యక్రియలు
గుర్తుతెలియని వ్యక్తుల చేతిల్లో హత్యకు గురైన ఇద్దరు బాలికల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. అసోహా పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి స్వగ్రామమైన బబుహారాలో కుటుంబీకుల సమక్షంలో పోలీసులే దగ్గరుండిమరీ అంత్యక్రియలు చేయించారు. గతేడాది హాత్రస్ గ్యాంగ్ రేప్ ఘటనలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి ఉన్నావ్ లో పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.