ఉన్నవ్ రేపిస్ట్ ఎమ్మెల్యేకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ : ఆయన పేరు మీద యాడ్స్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు, ఉద్వాసనకు గురైన ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగర్ పై పార్టీ నేతల్లో అభిమానం ఇంకా తగ్గలేదు. భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగర్ ను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసినప్పటికీ..స్థానిక కేడర్ లో ఆయనపై ఉన్నక్రేజ్ లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆయనను అభిమానించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టలేదు.
దుబాయ్ విమానాశ్రయంలో వైఎస్ జగన్.. పక్కనే పార్టీ ఎంపీలు
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గురువారం బీజేపీకి చెందిన పలువురు నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.ఆయన ఫొటోను ముద్రించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను నియోజకవర్గం మొత్తం గోడలపై అతికించారు. అత్యాచార ఘటనలో తమ ఎమ్మెల్యే నిర్దోషి అనే అర్థం వచ్చేలా ప్రచారం సాగించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు నియోజకవర్గం ఓటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు స్థానిక హిందీ దినపత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లోనూ కుల్ దీప్ సింగ్ సెంగర్ ఫొటో చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం జనాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఉన్నవ్ మున్సిపాలిటీ ఛైర్మన్ అనూజ్ కుమార్ దీక్షిత్ స్వయంగా ఈ యాడ్స్ ను జారీ చేశారు. సెంగర్ ను ఇప్పటికీ తమ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నామని దీక్షిత్ చెప్పారు. పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారే తప్ప, తన పదవికి ఆయన ఇంకా రాజీనామా చేయలేదని గుర్తు చేస్తున్నారు.సెంగర్ తన పదవికి రాజీనామా చేసి, కొత్త ఎమ్మెల్యే వచ్చేంత వరకూ ఆయనే తమ ఎమ్మెల్యే అని బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండటం జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగం పేరిట ఓ మైనర్ బాలికను లొంగదీసుకుని, ఆమెపై అత్యాచారం చేసిన ఘటనలో సెంగర్ పై సీబీఐ కేసు నమోదు చేసి, దోషిగా గుర్తించినప్పటికీ.. సెంగర్ పట్ల అభిమానం చావట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు అక్కడి ప్రజలు. అత్యాచార బాధితురాలి తండ్రిని సైతం హత్య చేసి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. కుల్ దీప్ సింగ్ సెంగర్ పై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. సీబీఐ కేసు నమోదు చేసిన కొద్దిరోజుల్లోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.