ముఖ్యమంత్రి పరామర్శించిన తరువాతే అంత్యక్రియలు: అత్యాచార మృతురాలి కుటుంబం..!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైన బాలిక మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించిన తరువాతే తాము అంత్యక్రియలను నిర్వహిస్తామని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. తమను పరామర్శించడానికి కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారని, వారి ఓదార్పు తమకు ఏ మాత్రం అక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు.
90 శాతం కాలిన గాయాలతో.. కన్నుమూత
ఉన్నవ్ లో ఏడాది కిందట ఓ బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదైంది. విచారణలో భాగంగా బాధిత బాలిక న్యాయస్థానానికి వెళ్తుండగా.. అత్యాచారారిని పాల్పడిన కిరాతకులు ఆమెపై మరోసారి దాడి చేశారు. కిరోసిన్ పోసి, తగులబెట్టారు. 90 శాతం మేర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు మరణించారు. ఆదివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించాల్సి ఉంది.
సానుభూతి వెల్లువ..
మృతురాలి కుటంబంపై రాజకీయ నాయకులు సహా పలువురు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. కొందరు బీజేపీ నాయకులు కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నించినప్పటికీ.. నిరసనలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ నేతల పరామర్శలను స్వయంగా మృతురాలి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.
ముఖ్యమంత్రే రావాలి..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి తమను పరామర్శించాలని, మృతదేహాన్ని చూడాలని వారు పట్టుబడుతున్నారు. ఆయన వచ్చిన తరువాతే తాము అంత్యక్రియలను నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని మృతురాలి చెల్లెలు స్పష్టం చేశారు. బీజేపీ నేతల పరామర్శలు తమకు అక్కర్లేదని, ముఖ్యమంత్రే రావాలని ఆమె అన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు..
ఉన్నావ్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించిన విషయం తెలిసిందే. నిందితులను అరెస్ట్ చేశామని, విచారణను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని అన్నారు. పారదర్శకంగా విచారణ చేపడతామని, నిందితులను కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టు ఉన్నావ్ బాధితురాలి నిందితులను కూడా కాల్చి చంపాలని ఆమె తండ్రి కోరారు.