హైదరాబాద్లో ఎన్కౌంటర్ చేసినట్లుగా ఉన్నావ్ నిందితులను కాల్చిపారేయాలి: బాధితురాలి తండ్రి
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో అలానే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరు అయ్యేందుకు వస్తుండుగా ఆమెపై కొందరు దుండగులు నిప్పు అంటించారు. దీంతో 90శాతం కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది.
ఎన్కౌంటర్ చేయాల్సిందే..!
తీవ్ర గాయాలపాలైన బాధితురాలని హెలికాఫ్టర్ ద్వారా ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్కు తరలించారు. ఆ ఐదుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపాల్సిందే అని డిమాండ్ చేసిన బాధితురాలి సోదరుడు ...సమాజంలో నుంచి వారి పేర్లు తొలగిపోవాలని ధ్వజమెత్తాడు. వారిని ఎన్కౌంటర్ చేస్తేనే తన సోదరి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పాడు. యోగీ ఆదిత్యనాథ్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తనను కాపాడాల్సిందిగా బాధితురాలు వేడుకొందని అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని కన్నీరు మున్నీరయ్యాడు.
కేసు విత్డ్రా చేసుకోవాలంటూ ఒత్తిళ్లు
ఇక చివరి క్షణాల్లో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితుల పేర్లు చెప్పింది. తను ఈ స్థితికి చేరడానికి కారణం శివం త్రివేది, శుభం త్రివేదితో పాటు హరిశంకర్ త్రివేది, ఉమేష్ బాజ్పాయ్, రామ్ కిషోర్ త్రివేదీలని పోలీసులకు చెప్పింది. రాయ్బరేలీ కోర్టుకు హాజరు అవుతుండగా తనను గౌరా క్రాసింగ్ వద్ద అడ్డుకుని కేసును విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారని వెల్లడించింది. మాట వినకపోవడంతో తనకు నిప్పు అంటించినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే నిందితులను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బాధిత కుటంబానికి న్యాయం చేస్తాం: యోగీ
ఉన్నావ్ బాధితురాలి మృతి తనను కలచివేసిందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పిన యోగీ ఆదిత్యానాథ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
నిందితుల బంధువులు బెదిరిస్తున్నారు
మరోవైపు ఉన్నావ్ బాధితురాలి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు తండ్రి చెప్పాడు. గ్రామంలో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న రీతిలో వ్యవహారం ఉందని, ఎవరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరని చెప్పాడు. ఇదిలా ఉంటే నిందితుల బంధువులు తమను బెదిరిస్తున్నారని చెప్పాడు బాధితురాలి మామ. కేసును విత్డ్రా చేసుకోకపోతే దుకాణంను కాల్చేస్తామని చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు తాను ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పాడు.