ఉన్నవ్ అత్యాచార మృతురాలి కుటుంబానికి గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం: ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నవ్ లో అత్యంత కిరాతకంగా కామాంధుల చేతుల్లో మరణించిన బాధితురాలి కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది. అత్యాచార మృతురాలి కుటుంబానికి 24 గంటల పాటు భద్రత కల్పించింది. కుటుంబ సభ్యులకు గన్ లైసెన్స్ ను మంజూరు చేసింది. మృతురాలి చెల్లెలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు నివాసాలను కేటాయించింది.
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనం
ముఖ్యమంత్రి దూతగా..
ఈ మేరకు లక్నో కమిషనర్ ముఖేష్ మేస్రం మృతురాలి కుటుంబానికి హామీ ఇచ్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. దీనితో ఆమె మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నవ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ప్రత్యేకంగా పారామిలటరీ బలగాలతో పహారాను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రే రావాలంటూ పట్టు..
తొలుత- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వచ్చి తమను పరామర్శించాలని అత్యాచార మృతురాలి కుటుంబీకులు పట్టుబట్టిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది వచ్చి తమను పరామర్శిస్తున్నారని, అవి తమకు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వస్తే గానీ తాము అంత్యక్రియలను నిర్వహించబోమని అన్నారు. దీనితో యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకున్నారు.
24 గంటల భద్రత..
తన ప్రతినిధిగా లక్నో కమిషనర్ ముఖేష్ మేస్రం ను పంపించారు. కొద్దిసేపటి కిందటే అత్యాచార మృతురాలి నివాసానికి చేరుకున్నారాయన. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వారికి తెలియజేశారు. ఏడాది కిందట అత్యాచారం చేసి, ఇప్పుడు మళ్లీ ప్రాణాలు తీసిన కిరాతకులు.. తమపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి చెల్లెలికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
గన్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగం..
దీనికి ముఖేష్ స్పందిస్తూ- 24 గంటల పాటు భద్రత కల్పిస్తామని అన్నారు. మృతురాలి చెల్లిలికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు నివాసాలను కేటాయిస్తామని చెప్పారు. వ్యక్తిగత భద్రత కోసం మృతురాలి సోదరుడికి గన్ లైసెన్స్ ను ఇస్తామని, దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పోలీసులే పర్యవేక్షిస్తారని ముఖేష్ తెలిపారు. ముఖేష్ ఇచ్చిన హామీ మేరకు మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.