ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలు
న్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొన్న భారత భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. సోమవారం జరిగిన ఫిక్కీ 93వ వార్షిక సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు.
Recommended Video
కరోనాతోపాటు చైనా మహమ్మారినీ ఎదుర్కొన్నాం..
ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తుంటే.. భారత సైనికులు మాత్రం సరిహద్దుల్లో దేశ రక్షణకు పాటుపడుతున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఏ మహమ్మారీ మన దేశ సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. పరోక్షంగా లడఖ్ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన.. మన సైనికులు చూపిన ధైర్యసాహసాలను ఉద్దేశించి ఆయన ఈ మేరకు స్పందించారు.
మన జవాన్లు పరాక్రమవంతులు
మన సరిహద్దుల్లో పొరుగు దేశాల(పాకిస్థాన్, చైనా) దుందుడుకు వైఖరి, ప్రపంచం ఎలా మారుతుందో తెలియజేస్తోందని రాజ్నాథ్ అన్నారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో గుర్తు చేస్తోందన్నారు. ఇంతటి పరీక్షా సమయంలోనూ సరిహద్దుల్లో మన సైనికులు చూపుతున్న తెగువ ప్రశంసించదగినదని అన్నారు. చైనా సైన్యంతో పోరాడిన మన వీరజవాన్లు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారన్నారు. ఎట్టకేలకు చైనా బలగాలను వెనక్కి తరిమేశారన్నారు.
భారత్ వాదనకు ప్రపంచ మద్దతు.. పాక్ ఏకాకి
సీమాంతర ఉగ్రవాదంతో మనం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని తెలిపారు. ఎవరూ అండగా లేనప్పుడు కూడా ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టామని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రంగా ఉందన్న భారత వాదనను ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందని రాజ్ నాథ్ చెప్పారు.
రైతులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమే..
ఇక వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలపై రాజ్ నాథ్ మాట్లాడుతూ.. అన్నదాతలకు మేలు చేసే చట్టాలు చేస్తే ప్రతిపక్ష పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అన్నదాతల అభిప్రాయాల్ని స్వీకరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఆయన అన్నారు. కరోనా కాలంలో నూ దేశంలో పుష్కలంగా పంటలు పండాయని కేంద్రమంత్రి రాజ్ నాథ్ తెలిపారు.