వీళ్లింతే: నిధులు ఖర్చు చేయని ఏపీ ఎంపీలు, దేశంలో 318మంది
న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగించడంలో పార్లమెంటు సభ్యులు తీవ్రంగా విఫలమవుతున్నారు. వీరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలే అత్యధికంగా ఉండటం గమనార్హం.
318ఎంపీలు
15వ లోక్సభకు సంబంధించి ఒక్క సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలు తమ నియోజకవర్గం అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు చేయలేకపోతున్నారు. 318 మంది ఎంపీలు తమకు కేటాయించిన నిధులను వాడుకోలేకపోయినట్లు కేంద్ర గణాంక శాఖ ప్రకటించింది.
గడువు పొడిగించినా..
15వ లోక్సభ మే 2014లో ముగిసినప్పటికీ నిధులు పూర్తిగా ఖర్చు చేసేందుకు గడువు మరో 21నెలల పొడిగించారు. అయినప్పటికీ 318మంది ఎంపీలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని కేంద్రం వెల్లడించింది.
ఏపీకి చెందిన 36మంది ఎంపీలు..
మహారాష్ట్రలో 39మంది, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో 27మంది, రాజస్థాన్లో 25మంది, ఏపీలో 23మంది ఎంపీలు తమ నిధులను పూర్తిగా వాడుకోలేదని వెల్లడించింది. 14వ లోక్సభకు సంబంధించి ఉమ్మడి ఏపీకి చెందిన 36మంది ఎంపీలు తమ నిధులను పూర్తిగా వాడుకోలేకపోయినట్లు తెలిపింది.
ఖాతాలు మూసేయండి..
ఇక ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్కు చెందిన 21మంది ఎంపీలు, కర్ణాటక 20, మహారాష్ట్రకు చెందిన 18మంది పార్లమెంటు సభ్యులు ఎంపీల్యాడ్స్ నిధులను పూర్తి వాడుకోలేదని కేంద్రం పేర్కొంది. ఎంపీల్యాడ్స్ పనులను సమీక్షించి ఖాతాలను మూసివేసేలా సూచించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.