ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను చూపిస్తూ.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జీకి ఇటీవల పోలీసులు, రెవెన్యూ అధికారులు సీల్ చేశారు.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లాడ్జీ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఆ పిటిషన్పై న్యాయమూర్తి ఎంఎన్ రమేష్ సమక్షంలో విచారణకు వచ్చింది. పోలీసులు చెప్పే వివరణతో ఏకీభవించలేమని, అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టం లేని నేపథ్యంలో అది ఎలా తప్పవుతుందని జడ్జీ ప్రశ్నించారు.
'లివింగ్ టుగెదర్' విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో.. అలాగే లాడ్జీలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని న్యాయమూర్తి వెల్లడించారు. మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో ఆ లాడ్జీ అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని వ్యాఖ్యానించారు.
కాగా, తమిళనాడు మద్యపానచట్టం ప్రకారం ఓ వ్యక్తి స్వదేశంలో తయారైన విదేశీ మద్యం లీటర్, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్లు వైన్ కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. లాడ్జీ మూసివేతలో చట్టం ప్రకారం నిబంధనలు పాటించలేదని, అందువల్ల సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టర్ను న్యాయమూర్తి ఆదేశించారు.