రాజకీయాలకు పనికిరాను: ఎమ్మెల్యే పదవికి ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామా!
ముంబై: మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. తాను రాజకీయాలకు పనికి రానని, అనర్హుడినని.. అందుకే రాజీనామా చేయనున్నట్లు బీద్ జిల్లా మజగల్గావ్ నియోజక వర్గం నుంచి ఎన్నకైన ప్రకాశ్ సోలంకీ సోమవారం రాత్రి ప్రకటించారు.
మంగళవారం నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రకాశ్ స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడానికి.. తన నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
అయితే ఇప్పుడు జరిగిన కేబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడినని నిరూపించిందని ప్రకాశ్ సోలంకీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వల్లే ఆయన అసంతృప్తికి గురై రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎన్సీపీ సీనియర్ నేత అయిన ప్రకాశ్ సోలంకీ.. మజల్గావ్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రకాశ్ సోలంకీ ఒకవేళ రాజీనామా చేస్తే ఆ సంఖ్య 53కి పడిపోనుంది.
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సోమవారం జరిగిన విషయం తెలిసిందే. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు మంత్రివర్గంలో చోటు దక్కింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి మొత్తం 36 మంది మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.