జైల్లో పోలీసులపై ఖైదీల దాడి: ఇద్దరికి గాయాలు
రాయ్బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి జైల్లో కొందరు ఖైదీలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రాయ్బరేలీ జైలులోని ఖైదీలకు పలు సౌకర్యాలు అందుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ సమయంలోనే పలువురు ఖైదీలు.. జైలర్ ధీరజ్ షా, ఉప జైలర్ శైలేంద్ర, మరికొందరు పోలీసులపై దాడులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కాగా, గాయాలపాలైన జైలర్, ఉపజైలర్, పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో జైళ్ల శాఖ డిఐజి శరద్ కుల్శ్రేష్ట జైలును సందర్శించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే కొండచరియలు విరిగిపడడానికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కులులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారా వర్షాలకు ధ్వంసమైంది.