ఐదేళ్లలో భారీగా పెరిగిన బీహార్ ఎమ్మెల్యేల ఆస్తులు
పాట్నా: 2010లో పోటీ చేసి గెలిచిన బీహార్ రాష్ట్ర ఎమ్మెల్యేల ఆస్తులు ఈ అయిదేళ్ల కాలంలో అమాంతం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల పెరుగుదలలో జేడీయుకు చెందిన పూనమ్ దేవి యాదవ్ అందరికంటే ముందున్నారు.
2010లో పూనమ్ దేవీ యాదవ్ తన ఆస్తులను రూ.1.87 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఆమె తన ఆస్తులను రూ.41.34 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఆస్తులు ఈ అయిదేళ్ల కాలంలో 2103 శాతం పెరిగాయని తెలుస్తోంది.
పూనమ్ దేవీ యాదవ్ తూర్పు బీహార్లోని ఖగారియా నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే, పూనమ్ వివరణ మరోలా ఉంది. తన పేరు మీదున్న భూముల విలువ పెరగడం వల్లే ఆస్తి విలువ పెరిగిందని చెప్పింది.
నిన్నటి వరకు జేడీయూ ఎమ్మెల్యేగా ఉన్న పూర్ణిమా యాదవ్.. మహాకూటమి పొత్తులో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నవద సీటును కోల్పోయారు. దీంతో జేడీయూను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఇప్పుడు గోవింద్ పూర్ నుంచి బరిలోకి దిగారు.
2010లో రూ.2.75 కోట్ల ఆస్తులు ప్రకటించిన ఆమె ప్రస్తుతం రూ.16.14 కోట్ల సంపద ఉన్నట్లు వెల్లడించింది. బిజెపి ఎమ్మెల్యే విజయ్ కుమార్ రూ.4.13 కోట్ల నుంచి 15.64 కోట్లకు పెరిగాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ ఆస్తులు రూ.2.83 కోట్ల నుంచి రూ.12.89 కోట్లకు పెరిగాయి. ఎస్పీ ఎమ్మెల్యే అన్వేశ్ కుమార్ రూ.1.25 కోట్ల నుంచి రూ.8.18 కోట్లకు ఎగబాకారు.
ఏడీఆర్ వివరాల ప్రకారం గడిచిన అయిదేళ్లలో 160 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల దాదాపు 200 శాతం పెరిగాయి. పార్టీల వారీగా బిజెపికి చెందిన 66 మంది ఎమ్మెల్యేలు, 52 మంది జెడీయూ ఎమ్మెల్యేలు, 12 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు, జీతన్ రామ్ మాంఝీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సంపద పోగేశారు. ఓ సిపిఐ ఎమ్మెల్యే కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. సదరు కమ్యూనిస్ట్ నేత ఆస్తులు 60 శాతం పెరిగాయి.