కర్ణాటకలో 215 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, క్రిమనల్ కేసుల్లో కూడ టాప్: ఏడీఆర్ రిపోర్ట్
బెంగుళూరు:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 215 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక ప్రకటించింది. కాంగ్రెస్, బిజెపి, జెడి(ఎస్) పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడ కోట్లకు పడగలెత్తారని ఆ నివేదిక ప్రకటించింది. ఎన్నికల సంఘానికి ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన నివేదిక ఆధారంగానే ఈ నివేదికను సమర్పించినట్టుగా ఏడీఆర్ ప్రకటించింది.
మే 12వ తేదిన కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన 222 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 215 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక ప్రకటించింది.ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కోటీశ్వరులున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల గురించి నివేదిక విడుదల చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన 222మంది ఎమ్మెల్యేలలో 215 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. సగటున ఒక్కో ఎమ్మెల్యే 35 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారని ఆ నివేదిక ప్రకటించింది.
2013 ఎన్నికల్లో గెలుపొందిన వారి కంటే ఇది 11 కోట్లు ఎక్కువని వెల్లడించింది. ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలోని టాప్ 10 మందిలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. హోసకోటె ఎమ్మెల్యే ఎన్ నాగరాజు 1015 కోట్ల రూపాయల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. డీకే శివకుమార్ 840 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచారు. సురేశ్ బీఎస్ 416 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
కొత్తగా ఎన్నికైన చట్టసభ ప్రతినిధుల్లో అత్యధిక మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీలోని 99 శాతం మంది ఎమ్మెల్యేలని కోటీశ్వరులుగా ఏడీఆర్ నివేదిక వెల్లడిస్తోంది. సగటున ఒక్కో ఎమ్మెల్యే 60 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక 98 శాతం మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే వీరి సగటు ఆస్తుల విలువ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే తక్కువగా ఉందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బిజెపి ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సుమారు రూ. 17 కోట్లుగా ఉందని పేర్కొంది.
ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్న జేడీఎస్ కూడ ఆస్తుల విలువల్లో ఏ మాత్రం తీసిపోలేదు. జెడి(ఎస్) కు చెందిన ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు సగటున 24 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్న 95 శాతం ఎమ్మెల్యేలతో మూడో స్థానంలో నిలిచింది.
కర్ణాటక రాష్ట్రంలో విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యేల్లో 35 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా ఈ విషయంలో బీజేపీ 41 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పారు. జేడీఎస్- కాంగ్రెస్లు 30 శాతం మంది ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.