కాంగ్రెస్తో కలిస్తే ఏమౌతుంది: అఖిలేష్కు ఫుల్ క్లారిటీ: దైవాధీనం..ఆ నిర్ణయం: మాయావతికీ!
లక్నో: దేశ రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తోన్న ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది తెర మీదికి రానున్నాయి. ఈ ఏడింట్లో అయిదు ప్రధాన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఫలితం ఎలాంటిదైనా.. దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపించే ఎన్నికలుగా వాటిని భావిస్తోన్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రతిబింబించేలా ఉంటాయని అంచనా వేస్తోన్నారు. క్రమంగా ఆయా చోట్ల రాజకీయ పరిస్థితులు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. పొత్తులు, సీట్ల పంపకాలు తెరమీదికి వస్తోన్నాయి.
ఏడు రాష్ట్రాల్లో..
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, గోవా సహా మణిపూర్, పంజాబ్ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్లో తాము అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామంటూ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇవే పరిస్థితులు ఉత్తర ప్రదేశ్లోనూ సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఉత్తర ప్రదేశ్కే చెందిన అధికార బీజేపీ, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పొత్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్నాయి కూడా.
చిన్నపార్టీలతోనే పొత్తు..
అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్లో మరోసారి అధికారాన్ని చేజక్కించుకోవడానికి పావులు కదుపుతోన్న సమాజ్ వాది పార్టీ- పెద్ద పార్టీలతో పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో దిగబోతోంది. కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. ప్రధాన పార్టీలకు బదులుగా చిన్నపార్టీలను కలుపుకొంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల ఛానల్ ఇండియాటుడే/ఆజ్తక్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్న పార్టీలను కలుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తామని అఖిలేష్ తేల్చి చెప్పారు.
యోగి సర్కార్పై వ్యతిరేకత..
బీజేపీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని అఖిలేష్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ, క్షేత్ర స్థాయిలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులు, వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబీకులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా యోగి సర్కార్ పట్ల విసిగిపోయారని, సమయం కోసం ఎదురు చూస్తోన్నారని అన్నారు. కరోనా తరహా పరిస్థితులను కూడా బీజేపీ రాజకీయ అవసరాల కోసం మార్చుకుందని మండిపడ్డారు.
పాలన దైవాధీనం..
రాష్ట్రంలో పాలన అనేది దైవాధీనంగా మారిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. తమ సొంత ఖర్చులతో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత దాని బారి నుంచి ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ సారి ఎవరిని ఎన్నుకోవాలనేది, ప్రభుత్వాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనేది ప్రజలు ముందే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని అఖిలేష్ అన్నారు.