యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అసదుద్దీన్ ఒవైసీ పార్టీతో ఎలాంటి పొత్తూ లేదు: తేల్చేసిన అఖిలేష్ యాదవ్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధిపతి, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తూ లేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.
సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే తమ పొత్తలను ఖరారు చేసిందని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ యాదవ్ తెలిపారు. కొన్ని చిన్న చిన్న పార్టీలతో పొత్తు విషయంపై చర్చ జరుగుతోందన్నారు. అయితే, ఏఐఎంఐఎంతో మాత్రం పొత్తు ఉండబోదని అఖిలేష్ యాదవ్ తేల్చిచెప్పారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎవరికైతే కుటుంబం ఉండదో.. వారికి కుటుంబసభ్యుల బాధలు, ప్రేమలు తెలియవని అన్నారు. యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. పేదరికం పోలేదని, సామాన్యులకు భద్రత, రక్షణ కూడా లేదని అన్నారు.
ఈ ఐదేళ్లలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వ పెద్దలు తమ హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాగా, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరి, అఖిలేస్ యాదవ్ నవంబర్ నెలలో భేటీ అయిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మధ్య పొత్తు ఉంటుందని ఇద్దరు నేతలు కూడా ప్రకటించారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి-మార్చి నెలలో జరగనున్నాయి. యూపీలోని 403 సీట్లకు జరగనున్న ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. 300కుపైగా సీట్లు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 312 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీకి 47 సీట్లు, బీఎస్పీకి 19 స్థానాలు దక్కాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏడు స్థానాలు దక్కాయి.