పోలీసుని చితకబాది.. నోట్లో మూత్రం పోశారు.. బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకం
అతను పేరుకే లీడర్. తీరు మాత్రం పక్కా క్రిమినల్. అధికార బీజేపీ ఎమ్మెల్యే కావడంతో ఆగడాలకు అడ్డులేకుండాపోయింది. సామాన్యుల్ని చావగొట్టడం అటుంచితే ఏకంగా పోలీసులపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతజరిగినా అతనిపై కేసు నమోదుకాలేదు. చివరికి కోర్టు జోక్యంతోగానీ ఎఫ్ఐఆర్ దాఖలైంది. యోగి రాజ్యం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..
అసలేం జరిగిందంటే..
వెస్ట్ యూపీలోని ఫిలిబిత్ జిల్లా బర్ఖేరా టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న మోహిత్ గుజ్జార్ ఈ మధ్యే ఓ వ్యక్తి దగ్గర్నుంచి బైక్ కొన్నాడు. అందుకుగానూ రూ.50వేలు చెల్లించాడు. తీరా కొన్న తర్వాత.. దానికి సరైన డాక్యుమెంట్స్ లేవని తెలిసింది. దీంతో బైక్ ను వెనక్కిచ్చేసి, డబ్బులు తిరిగితీసుకోవాలనుకున్నాడు. కానీ బైక్ అమ్మిన వ్యక్తి రివర్స్ అయ్యాడు. దాన్ని వెనక్కి తీసుకోబోనని తెగేసి చెప్పాడు. ఎమ్మెల్యే జోక్యంతో ఈ గొడవ ఇంకా ముదిరింది.
కొట్టి చంపే ప్రయత్నం..
కానిస్టేబుల్ మోహిత్ రోజూ వెంటపడుతుండటంతో బైక్ అమ్మిన వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ పై దాడిచేసిన యువకుల్లో బర్ఖేరా ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్పుత్ మేనల్లుడు కూడా ఉన్నాడు. దెబ్బలుతిన్న కానిస్టేబులు.. ప్రాణభయంతో దగ్గర్లోని పోలీస్ చెక్ పోస్టులోకి పరుగులు తీశాడు. ఎమ్మెల్యే మేనల్లుడు తనపై కాల్పులు జరిపినట్లు కూడా అతను ఆరోపించాడు. కానీ తోటి పోలీసులెవరూ అతనికి సాయంగా నిలబడలేదు.
ఎమ్మెల్యే ఎంట్రీతో ఇంకా దారుణం
మేనల్లుడు ఫోన్ చేయడంతో పోలీస్ చెక్ పోస్టు దగ్గరికొచ్చిన ఎమ్మెల్యే కిషన్ లాల్.. కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డాడు. ‘నా ఫ్యామిలీ జోలికి రావడానికి ఎంత ధైర్యం..'అంటూ షూతో, లాఠీతో విపరీతంగా కొట్టాడు. సొమ్మసిల్లిపడిపోయిన కానిస్టేబుల్ పై మూత్రం పోయాలని యువకుల్ని ఆదేశించాడు. తనపై దాడిని సొంత డిపార్ట్ మెంటే పట్టించుకోపోయేసరికి మోహిత్ కోర్టును ఆశ్రయించాడు.
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
కానిస్టేబుల్ పై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యేపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశించిన తర్వాతగానీ పోలీసు శాఖ కదల్లేదు. ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్ పుత్ తోపాటు అతని మేనల్లుడు, 11 మంది అనుచరులు, గుర్తుతెలియని మరో 35 మందిపై ఐపీసీ సెక్షన్ 397, 395 కింద మంగళవారం ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు బర్ఖేరా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రాజేశ్ కుమార్ తెలిపారు.