ఆ టీనేజర్ను పగబట్టిన పాము..? నెల రోజుల్లో 8 సార్లు కాటేసింది...
ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ 17ఏళ్ల టీనేజర్ను గత నెల రోజుల్లో ఒకే పాము 8 సార్లు కాటు వేసింది. ఆఖరికి బంధువుల ఇంటికెళ్లినా సరే... అదే పాము అక్కడికి కూడా వచ్చి కాటు వేసింది. ఇప్పటికే ఎన్నోసార్లు చావు నుంచి తప్పించుకున్న అతను పాము భయంతో నిత్య నరకం అనుభవిస్తున్నాడు. ఈ విషయాలను బాధితుడి తండ్రి వెల్లడించాడు.
బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం... బస్తీ జిల్లాలోని రాంపూర్ గ్రామానికి చెందిన యశ్రాజ్ మిశ్రాను గత వారం ఓ పాము కాటేసింది. అదే పాము గతంలో అతన్ని ఏడుసార్లు కాటు వేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఎనిమిదోసారి పాము కాటు వేయడంతో పాము పగబట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'ఒకే నెలలో మూడోసారి పాము కాటుకు గురైనప్పుడు నా కొడుకు మిశ్రాను బంధువుల ఇంటికి పంపించాను. అక్కడైనా సేఫ్గా ఉంటాడమోనని భావించినప్పటికీ అలా జరగలేదు. కొద్దిరోజులకు అదే పాము నా కొడుక్కి అక్కడ కూడా కనిపించింది. మరోసారి అది అతన్ని కాటువేసింది. దీంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాం.' అని మిశ్రా తండ్రి చెప్పారు.
ఒకే పాము మిశ్రాపై ఇన్నిసార్లు ఎందుకిలా దాడి చేస్తుందో తమకు అర్థం కావట్లేదని మిశ్రా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మిశ్రా మానసికంగా చాలా కుంగిపోయాడని... నిత్యం పాము భయంతో నరకం అనుభవిస్తున్నాడని చెప్పారు. కొంతమంది సలహా మేరకు పలుమార్లు పూజలు కూడా చేశామని అయినా లాభం లేకపోయిందని అన్నారు. పాములను పట్టేవారిని పిలిచినా అది వారికి దొరకలేదన్నారు. 8 సార్లు పాము కాటుకు గురైనా ఇప్పటికైతే మిశ్రాకు ఏమీ కాలేదని... వైద్య చికిత్సతో పాటు పాములు ఆడించేవారు చెప్పే పలు థెరపీలతో అతన్ని బతికించుకుంటున్నామని చెప్పారు.