రాఖీ పౌర్ణమి: మహిళలకు యోగి ఆదిత్యనాథ్ బహుమతి, బస్సుల్లో ఉచితం
లక్నో: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు బహుమతి ఇచ్చారు! సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లే సోదరీమణులకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు.
శనివారంఅర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి 12గంటల వరకు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. అంటే ఆదివారం మొత్తం మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
ఆదివారం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని యోగి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన సోదరులను సులభంగా కలుసుకునేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తాను ఇక్కడి నుంచి రెండు బస్సులను ప్రారంభించానని, అన్ని స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ సదుపాయం మహిళా సోదరీమణులకు ఉంటుందని చెప్పారు.