వస్తానన్నారు.. వచ్చారు: తాజ్ మహాల్ ముందు చీపురు పట్టిన సీఎం యోగి!
అన్న మాట ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తాజ్మహల్ను సందర్శించారు. అంతేకాదు, తాజ్మహల్ పశ్చిమ గేటు ఎదుట స్వయంగా చీపురు పట్టుకొని ఆయన రోడ్లను ఊడ్చారు.
ఆగ్రా: అన్న మాట ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తాజ్మహల్ను సందర్శించారు. ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాల్లో ఒక్కటైన తాజ్మహల్పై ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం యోగి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
నేరుగా ఆగ్రాకు చేరుకున్న సీఎం యోగి.. తాజ్మహల్ పశ్చిమ గేటు ఎదుట 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తొడిగి.. స్వయంగా చీపురు పట్టుకొని రోడ్లను ఊడ్చారు.
సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత యోగి మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ను సందర్శించడం ఇదే తొలిసారి. తాజ్మహల్ భారత సంస్కృతిపై మచ్చ అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించడం, తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం 'తెజోమహల్' అని బీజేపీ నేత వినయ్ కటియార్ పేర్కొనడం కమలం పార్టీని ఇరకాటంలో నెట్టేసింది.
ఈ వ్యాఖ్యల వివాదాన్ని తోసిపుచ్చిన సీఎం యోగి.. ఈ కట్టడాన్ని ఎవరు, ఎందుకు కట్టారన్నది ముఖ్యం కాదని, భారతీయ కార్మికులు తమ స్వేదం, రక్తం చిందించి తాజ్మహల్ను నిర్మించారన్న విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు.
గతంలో 2016లో బీహార్ లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ తాజ్ మహల్ పై యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాని సందర్శనకు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు దాని నమూనా కాకుండా, భగవద్గీత అందజేయడం మంచిదని వ్యాఖ్యానించారు.
ఆ తరువాత తన తప్పిదాన్ని తెలుసుకుని మాట మార్చారు. తాజ్ మహల్ ఎవరు కట్టించినా అది భారతీయ వైభవానికి చిహ్నమని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కట్టడాల్లో ఒకటని చెప్పారు.
తాజ్ మహాల్ కట్టడం వివాదాస్పదం కావడానికి బీజం వేసింది తొలుత ఆ రాష్ట్ర పర్యాటక శాఖే. యూపీ టూరిజం డిపార్ట్ మెంట్ ఆ మధ్య విడుదల చేసిన బుక్ లెట్ లోని డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో తాజ్ మహాల్ కట్టడం లేక పోవడం వివాదాస్పదమైంది.
దీంతో ఆ కట్టడాన్ని కూల్చివేయడం మంచిదని పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించడం యోగి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. దీంతో సీఎం యోగి జరిగిన తప్పును దిద్దుకునే చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆగ్రాలో టూరిజం అభివృద్ధికి, తాజ్ మహల్ అభివృద్ధికి రూ.370 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా తన ఆగ్రా పర్యటనలో తాజ్ మహల్ కట్టడానికి తాము ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో మాటల్లో కాకుండా చేతల్లో చెప్పే ప్రయత్నం చేశారు సీఎం యోగి. తాజ్ మహల్ ఎదుటే స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి దాని సుందరీకరణకు, పరిశుభ్రతకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చాటిచెప్పారు.