హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం...
హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని... బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బుధవారం(సెప్టెంబర్ 30) ఆయన బాధితురాలి తండ్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Recommended Video
విపక్షాల నిరసనలు...
మరోవైపు హత్రాస్ ఘటనను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్ భవన్,ఇండియా గేటు వద్ద కాంగ్రెస్,వామపక్షాలు,భీమ్ ఆర్మీ ఆందోళనకు దిగాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. వీళ్లలో ఎక్కువమంది మహిళా సామాజిక కార్యకర్తలు,విద్యార్థులే ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఒకచోట గుంపుగా చేరినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి.
పోలీసులపై ఆరోపణలు...
హత్రాస్ ఘటనకు నిరసనగా ఇండియా గేటు వద్ద వామపక్ష విద్యార్థి సంఘం క్యాండిల్ లైట్ మార్చ్ చేపట్టింది. కొంతమంది భీమ్ ఆర్మీ కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు. అయితే పోలీసులు కొంతమంది నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి చెదరగొట్టారు. దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కొంతమంది మహిళల పట్ల వారు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు.
హెచ్ఆర్సీకి ఫిర్యాదు...
మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ సుష్మితా దేవ్,ఢిల్లీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమృతా ధావన్,ఢిల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్లు కూడా ఇండియా గేటు వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. ఘజియాబాద్లోనూ కాంగ్రెస్,సమాజ్వాదీ,ఆర్ఎల్డీ,అఖిల భారతీయ వాల్మీకి సమాజ్ నిరసనలు చేపట్టాయి. ఢిల్లీ కాంగ్రెస్ లీగల్&హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ మానవ హక్కుల కమిషన్కు హత్రాస్ ఘటనపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది.
మోదీ ఆదేశించారన్న యోగి...
హత్రాస్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఘటనపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో పాటు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు.ముగ్గురు సభ్యుల ప్యానల్ బృందం ఘటనపై దర్యాప్తు జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రధానమంత్రి మోదీ తనను ఆదేశించినట్లు యోగి తెలిపారు. నిందితులను ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.