ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్
లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండురోజుల కిందట కూడా ఆయన అధిక మధుమేహానికి గురయ్యారు. రామ్ మనోహర్ లోహియా వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం లక్నోలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. ములాయంను పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ములాయం సింగ్ వెంట ఆయన కుమారుడు, సమాజ్వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు శివ్పాల్ యాదవ్ ఉన్నారు.
మూడు నెలల వ్యవధిలో ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యానికి గురి కావడం ఇది మూడోసారి. ఇదివరకు ఆయన సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. అప్పటి నుంచీ ఆయన తరచూ అధిక రక్తపోటు, అధిక మధుమేహం బారిన పడుతూ వస్తున్నారు. కొద్దిరోజుల కిందట అధిక రక్తపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా అధిక మధుమేహానికి గురయ్యారు.