విజయగర్వంతో మోడీని కలిసిన యోగి.. ఇక టార్గెట్ 2019 ఎన్నికలే!
ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీని శనివారం న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీని శనివారం న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
ఎనిమిది నెలల క్రితం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ సీఎం పగ్గాలు చేపట్టారు. అనంతరం ఆయన ఎదుర్కొన్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఆయన స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
ఎన్నికల సందర్భంగా సీఎం యోగి ముమ్మర ప్రచారం చేశారు. శుక్రవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 16 మేయర్ స్థానాల్లో 14 మేయర్ స్థానాలు బీజేపీ ఖాతాలోకి చేరడంతో యూపీలో బీజేపీ సంబరాలు మిన్నంటాయి.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని, ప్రధాని మోడీ విజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్దేశకత్వానికి లభించిన విజయమిదని యోగి అభివర్ణించారు.
అమేథిలో కాంగ్రెస్ ఓటమిపై కూడా యోగి స్పందిస్తూ, గుజరాత్ తరహా అభివృద్ధిని విమర్శిస్తున్న వారు అమేథిలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకావాలని హితవు పలికారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో వంద శాతం విజయంపై దృష్టి సారిస్తామని యోగి పేర్కొన్నారు.