హత్రాస్ గ్యాంగ్ రేప్... సీఎం యోగి కీలక నిర్ణయం... కేసు సీబీఐకి అప్పగింత...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(వాల్మీకి) యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కేసును సీబీఐకి అప్పగించడంపై బాధితురాలి సోదరుడు స్పందించాడు.ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతున్నందునా... సీబీఐ విచారణకు తాము డిమాండ్ చేయలేదన్నాడు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ చేపట్టాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం(అక్టోబర్ 3) సాయంత్రం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు ఆ కుటుంబంతో భేటీ అయిన సందర్భంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఇక ఈ కేసుకు సంబంధించి శుక్రవారం(అక్టోబర్ 2) హత్రాస్ డీఎస్పీ విక్రాంత్ వీర్ సహా మరో ముగ్గురిని సీఎం యోగి సస్పెండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఆ ముగ్గురిపై వేటు పడింది. కేసులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరికీ నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
కాగా, సెప్టెంబర్ 14న గడ్డి కోసుకొచ్చేందుకు తల్లితో కలిసి పొలానికి వెళ్లిన బాధితురాలిపై నలుగురు అగ్ర కుల వ్యక్తులు దారుణ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తమ పేర్లు బయటపెట్టకుండా ఉండేందుకు ఆమె నాలుకను సైతం కోసేశారు. దాదాపు 2 వారాలు మృత్యువుతో పోరాడిన బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో మృతి చెందింది. అయితే అదే రోజు అర్ధరాత్రి హడావుడిగా కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా బాలిక మృతదేహానికి పోలీసులు,అధికారులే దహన సంస్కారాలు నిర్వహించారు. తద్వారా మృతదేహం సెకండ్ పోస్టుమార్టమ్కు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు,తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. అటు విపక్షాలు,ఇటు సామాజిక కార్యకర్తలు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
We did not demand CBI inquiry in the case as SIT investigation is already underway: Brother of the victim of #HathrasCase on CBI probe ordered by CM Yogi Adityanath pic.twitter.com/uexdkbc75k
— ANI UP (@ANINewsUP) October 3, 2020