2019లో మోడీ.. కాదు, నేను పీఎం ఎలా కావాలి: యోగిపై కాంగ్రెస్ బ్రేకింగ్ న్యూస్ (వీడియో)
న్యూఢిల్లీ/లక్నో: సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు బాగా వినియోగించుకుంటున్నాయి. 2014లో బీజేపీ - మోడీ గెలుపుకు ఇది కూడా ఓ కారణం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైన ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది.
చదవండి: ప్రధాని మోడీ మనస్తాపం, 12న నిరాహార దీక్ష: వారం తర్వాత నిద్రలేచాలని కాంగ్రెస్
ఈ వీడియో కాంగ్రెస్ అభిమానులను చాలామందిని ఆకర్షిస్తోంది. యోగి ఫోటోను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్, నూడుల్స్ సెర్చ్ ఇంజిన్లో ద్వేషపూరిత ప్రసంగాలను, రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా చేయాలి అనే అంశాన్ని వెదుకుతున్నట్లుగా వీడియోను పోస్ట్ చేసి, దానికి ఆన్లైన్లో యోగి దేని కోసం సెర్చ్ చేస్తారో చూడండి అంటూ పేర్కొన్నారు. దీనిని బ్రేకింగ్ న్యూస్ అంటూ పేర్కొన్నారు.
యోగి ఆదిత్యనాథ్ పైన కాంగ్రెస్ వీడియో
ఈ వీడియోలో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకున్న పలు అంశాలను ప్రస్తావించారు. మంచి ప్రసంగం ఎలా చేయాలి అని పేర్కొంటు దానిని మధ్యలో ఆపేసి, విద్వేష ప్రసంగం ఎలా చేయాలి? మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి.. అనే దానిని మధ్యలో ఆపేసి చెడు ప్రభుత్వం ఎలా ఉండాలి? సోషల్ హార్మీని ఎలా అంటూ దానిని మధ్యలో ఆపేసి, డిస్ హార్మోనీ ఎలా అని అందులో పేర్కొన్నారు.
మోడీని... కాదు, యోగిని ఎలా పీఎం చేయాలి?
ఇంకా, క్రిమినల్స్ను ఎలా బయటకు తీసుకు రావాలి? అని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన యోగి వీడియోలు పెట్టారు. చివరలో మరో ఆసక్తికర అంశాన్ని జోడించారు. మోడీని 2019లో ప్రధానిగా ఎలా చేయాలి అనే దానిని మధ్యలో ఆపేసి.. యోగిని ప్రధాని ఎలా చేయాలి అనే దానిని యోగి ఆదిత్యనాథ్ వెతుకుతున్నట్లుగా పేర్కొన్నారు.
యోగిని పిలిపించుకొని క్లాస్
ఇదిలా ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను పిలిపించుకుని ప్రధాని క్లాసు తీసుకున్నారని తెలుస్తోంది. యూపీలోని రెండు లోకసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, రాష్ట్ర నాయకత్వంపై నలుగురు దళిత ఎంపీలు బాహాటంగా నిరసన తెలియజేయడం వంటి పరిణామాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
లక్నోకు అమిత్ షా
ఉత్తర ప్రదేశ్లో క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా అంచనా వేయడానికి ఈ నెల 11న పార్టీ అధ్యక్షులు అమిత్ షా లక్నో చేరుకోనున్నారు. ఇప్పటికే ఆరెస్సెస్ తరఫున కృష్ణగోపాల్, దత్తాత్రేయ హోసబలె యూపీలో పర్యటించి ఉప ముఖ్యమంత్రులు సహా వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాగా యోగిని సీఎం చేసినందుకు ఎప్పుడో ఓ రోజు ప్రధాని మోడీ పశ్చాత్తాపపడతారని కొందరు అంటున్నారు.