లాక్డౌన్..జాన్తానై: అయోధ్యలో ఉగాది వేడుకల్లో యోగి: అధికారులు, అనుచరులతో గుంపుగా
లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. గుళ్లూ, గోపురాలు మూత పడ్డాయి. ఊరూవాడా మూగబోయింది. మొత్తంగా జనజీవనం స్తంభించిపోయింది.. దేశవ్యాప్తంగా. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండటానికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వాటన్నింటినీ లెక్క చేయలేదు. లాక్డౌన్ను బ్రేక్డౌన్ చేశారు.
అయోధ్యలోని రామజన్మభూమిలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కొద్దిమంది అధికారులు, పార్టీ అనుచరులతో కలిసి ఆయన బుధవారం ఉదయం అయోధ్యకు వెళ్లారు. శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలను అయోధ్యకు తరలించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం ఇన్నాళ్లూ న్యాయస్థానాల్లో నలిగిన నేపథ్యంలో.. సంబంధిత వివాద ప్రదేశంలో రామ్లల్లా విగ్రహాలను ఉంచలేదు.
రామజన్మభూమి స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చిన్న షెడ్డులో శ్రీరాముడు, సీతమ్మ అమ్మవారి విగ్రహాలను ఉంచి.. పూజలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా- వివాదస్పద భూమి రామ్లల్లా విరాజ్మాన్కే దక్కిన నేపథ్యంలో.. ఇక శ్రీరామచంద్రుడి జన్మస్థలానికి స్వామివారి విగ్రహాలను తరలించే కార్యక్రమానికి ఉగాది నాడు శ్రీకారం చుట్టారు. ఇది ముందే నిర్ణయించుకున్న కార్యక్రమం కావడం వల్ల దీన్ని వాయిదా వేయలేకపోయింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.
శార్వరీ నామ ఉగాది పండుగను పురస్కరించుకుని.. శ్రీరాముడి విగ్రహాలను ఆయన జన్మస్థలానికి తరలించే కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేపట్టింది. ఈ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, బీజేపీ నాయకులు, రామమందిరం ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పూజల అనంతరం శ్రీరాముడి విగ్రహాలను అయోధ్యకు తరలించే పనులను చేపట్టారు.