ఏడడుగుల కోదండరాముని విగ్రహాన్ని అయోధ్యలో ఆవిష్కరించిన యోగీ
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఏడడుగుల రాముని విగ్రహాన్ని అయోద్యలో ఆవిష్కరించారు. ఒకే రోజ్ వుడ్ చెక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. రాముని ఐదు అవతారాల్లో ఒకరైన కోదండరాముడిని కర్నాటక నుంచి కొనుగోలు చేశారు. ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత అయోధ్య శోధ్ సంస్థాన్లో ఏర్పాటు చేసిన మ్యూజియంను సందర్శించారు. అక్కడ కొన్నిపుస్తకాలు, పోస్టల్ కవర్లను రిలీజ్ చేశారు యోగీ ఆదిత్యనాథ్.
కోదండరాముని విగ్రహంపై పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కవర్ను యోగీ ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఆర్కియలాజికల్ రిపోర్ట్ ఆఫ్ అయోద్య, రామ్లీలా జర్నీ ఆఫ్ ది కరేబియన్ కంట్రీస్ అనే రెండుపుస్తకాలను విడుదల చేశారు. విగ్రహావిష్కరణ తర్వాత నరేంద్ర మోడీని ప్రధాని అయ్యేందుకు దీవించిన సంత్ సమాజ్కు యోగీ ధన్యవాదాలు చెప్పారు.బీజేపీ రెండో సారి అధికారంలోకి రాగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలనే ఒత్తిడి ఎక్కువైంది. పలు హిందూ సంఘాలు వెంటనే రామమందిర నిర్మాణాన్ని అయోధ్యలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Chief Minister Yogi Adityanath unveils a statue of Lord Ram at Ayodhya Shodh Sansthan pic.twitter.com/RWKBhDafpJ
— ANI UP (@ANINewsUP) June 7, 2019
ఇక మ్యూజియంలో శ్రీరాముడికి సంబంధించి అనేక చిత్రాలు ఆయన చరిత్ర ఉన్నప్పటికీ కోదండరాముని రూపంలో ఒక్క విగ్రహం కూడా లేకపోవడంతో ప్రత్యేకంగా చేయించి మ్యూజియంలో ఉంచినట్లు ఆ మ్యూజియం డైరెక్టర్ వైపీ సింగ్ తెలిపారు. దీన్ని కర్నాటకలోని రాష్ట్ర ఆర్ట్ మరియు క్రాఫ్ట్ కేంద్రం నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అతని ప్రకారం శ్రీరాముడి జీవితం ఐదు దశలుగా ఉందన్నారు. బాల రామ్, రాజారామ్, దుల్హరామ్, బన్వాసీ రామ్ మరియు కోదండరాము లాంటి ఐదు దశలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కో రూపంలో ఉన్న శ్రీరాముడిని పూజిస్తారని చెప్పారు.
ఉత్తరంలో బాల్ రామ్, మరియు రాజారామ్ను కొలుస్తుండగా...బీహార్లో దుల్హా రాముడిని కొలుస్తారని చెప్పారు.దుల్హా రామ్ అనగా రాముడి వివాహం తర్వాత సీతరాములను కొలుస్తారని అర్థం. ఇందులో రాముడు ధనస్సును పట్టుకొని ఉండడని స్పష్టం చేశారు.బన్వాసీ రామ్ అనగా రాముడు లక్షణుడి మధ్యలో సీత ఉంటుందని వివరించారు. బన్వాసీ రామ్ ఘట్టం రాముడు లక్ష్మణుడు సీత అడవికి వెళ్లిన సమయం గురించి చెబుతుంది. బన్వాసీ రామ్ను మధ్యప్రదేశ్లో పూజిస్తారు. కోదండరాముడిని దక్షిణ భారతదేశంలో పూజిస్తారు. సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకెళ్లిన ఘట్టం ఇందులో కనిపిస్తుందని వెల్లడించారు.