మంటగలిసిన మానవత్వం : భర్త చనిపోయాడని బస్సు నుంచి దింపేశారు..
బారాబంకీ : మానవత్వం మంటగలుస్తోంది. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలన్న కనీస స్పృహ జనాలకు లేకుండా పోతోంది. బస్సులో ప్రయాణిస్తూ ప్రాణాలు వదిలిన ఓ వ్యక్తి పట్ల బస్ కండక్టర్ దారుణంగా వ్యవహరించాడు. భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న మహిళను ఓదార్చాల్సింది పోయి దారుణంగా వ్యవహరించాడు. భర్త శవంతో మహిళను నడిరోడ్డుపై వదిలేసి పోయాడు.
కలికాలం : 80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం..
బంధువుల ఇంటికి బయలుదేరిన జంట
ఉత్తర్ప్రదేశ్కు చెందిన దంపతులు బంధువుల ఇంటికి వెళ్లేందుకు బహ్రయిచ్ నుంచి లక్నోకు బయలుదేరారు. యూపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ప్రయాణం మొదలుపెట్టారు. దంపతులిద్దరూ ఒకరితో ఒకరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు.. భర్త అస్వస్థత పాలయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు నవ్వుతూ కబుర్లు చెప్పిన భర్త కన్నుమూయడంతో భార్య కన్నీరు మున్నీరైంది. ఆ దృశ్యం చూసి తోటి ప్రయాణీకులు సైతం కంటనీరు పెట్టారు.
నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన కండక్టర్
భార్య ఏడుపు విని వారు కూర్చున్న సీటు వద్దకు వెళ్లిన కండక్టర్ విషయం తెలుసుకున్నాడు. భర్త చనిపోయి బోరున విలపిస్తున్న ఆమె పట్ల జాలి చూపకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. మృతదేహంతో పాటు ఆమెను బారాబంకిలోని రామ్ నగర్ క్రాసింగ్ వద్ద దింపేసి వెళ్లిపోయాడు. వారు బస్సు ఎక్కినట్లు సాక్ష్యం లేకుండా టికెట్ను లాక్కుని చించేశాడు.
విచారణ జరుపుతామన్న డిపో ఇంఛార్జ్
ఇదంతా గమనించిన స్థానికులు బస్సు నెంబర్ నోట్ చేసుకున్నారు. బారాబంకి డిపోకు వెళ్లి ఇంఛార్జ్ మనోజ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి తమ దృష్టికి రాలేదని దీనిపై విచారణ జరిపి బస్సు డ్రైవర్, కండక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.