రేపిస్టుకు టికెట్ ఇస్తారా?: ప్రశ్నించిన కాంగ్రెస్ మహిళా నేతపై మూకుమ్మడి దాడి(వీడియో)
లక్నో: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేతపై అదే పార్టీకి చెందిన కొందరు ఆమెపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఆమెపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై నలువైపుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
అత్యాచార నిందితుడికి టికెట్ ఎలా ఇస్తారు?
డియోరియా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ముకుంద్ భాస్కర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఎన్నికల అంశంపై శనివారం పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటైంది. కాగా, ఈ సమావేశంలో తారా యాదవ్ అనే మహిళా నేత ఆయనకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యాచార నిందితుడికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించింది.
ప్రశ్నించిన మహిళా నేతపై మూకుమ్మడి దాడి
‘ఓ వైపు హత్రాస్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని పార్టీ పోరాడుతోంది. మరోవైపు ఓ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తోంది. ఇది తప్పుడు నిర్ణయం. ఇది పార్టీకే మాయని మచ్చ తెచ్చే విషయం' అని మహిళా నేత అన్నారు. దీంతో అక్కడున్న ఇతర కాంగ్రెస్ నేతలు ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఒకరిద్దరు నేతలు మాత్రమే ఆమెను వారి దాడి నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. దాడి క్రమంలో ఆమె బయటికి వెళ్లిపోయారు.
Recommended Video
ప్రియాంక స్పందించాలి.. రేఖా శర్మ సీరియస్
కాగా, ఈ దాడి ఘటనపై బాధిత మహిళా కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ జోక్యం చేసుకోవాలని తారా యాదవ్ డిమాండ్ చేశారు. మహిళపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, ప్రియాంక గాంధీ యూపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ పరిస్థితి మారలేదని విమర్శించారు. దాడి ఘటనకు సంబంధించిన వీడియో చూసిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖ శర్మ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మూర్ఖపు మనస్తత్వం గలవారు రాజకీయాల్లోకి ఎలా వస్తారు? దీన్ని పరిగణలోకి తీసుకుంటామని రేఖ శర్మ అన్నారు.