దీపావళి వేళ.. పోలీస్ జీపుకు తలబాదుకుంటూ రోధించిన చిన్నారి... ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్న వీడియో...
కరోనా కారణంగా ఈసారి చాలారాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించడంతో... బాణసంచా వ్యాపారులు తమ పరిస్థితేంటని వాపోతున్నారు. కొన్నిచోట్ల అక్రమంగా బాణసంచా విక్రయాలు జరుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలాగే అక్రమంగా బాణసంచా అమ్ముతున్నాడన్న కారణంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా... అతని కుమార్తె పోలీస్ జీపుకు తలబాదుకుని రోధించిన తీరు ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఆఖరికి పోలీసులు కూడా తామలా వ్యవహరించి ఉండాల్సింది కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఆ వ్యక్తిని విడుదల చేయడమే కాదు... అతని ఇంటికే వెళ్లి ఆ చిన్నారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... కరోనా వైరస్ కారణంగా ఈసారి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 నగరాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. అందులో బులంద్షహర్ నగరం కూడా ఒకటి. నిషేధం విధించినప్పటికీ కొంతమంది వ్యాపారులు బాణసంచా విక్రయిస్తున్నారన్న సమాచారంతో బులంద్షహర్ పోలీసులు కొన్ని షాపులపై దాడులు చేశారు. ఈ క్రమంలో ఖుర్జా మార్కెట్లో ఉన్న ఓ షాపుపై దాడి చేసి బాణసంచాను రోడ్డుపై పడేశారు.
ఆ వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ జీపు ఎక్కించారు. అదే సమయంలో అతని ముగ్గురు కుమార్తెలు పోలీసులకు అడ్డుపడి తమ తండ్రిని తీసుకెళ్లవద్దని బతిమాలారు. అయినప్పటికీ పోలీసులు వారి మాట వినిపించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో... అతని చిన్న కుమార్తె పోలీసు జీపుకు తన తల బాదుకుంటూ రోధించింది. అప్పటికీ పోలీసులు కనికరించలేదు.
See in What happening here?#Bulandshahr #UttarPradesh@myogiadityanath pic.twitter.com/21BnROk8gP
— YesImKafir (@KafirYes) November 13, 2020
Recommended Video
చిన్నారి పోలీసు జీపుకు తల బాదుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బులంద్షహర్ పోలీసుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడతో పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. పోలీసులు కాస్త సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందని ఎస్పీ సంతోష్ సింగ్ అన్నారు. వివాదం మరింత ముదరకముందే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ చిరు వ్యాపారిని విడుదల చేయడమే కాదు... ఇందుకు బాధ్యులైన పోలీసులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి... ఆ చిన్నారితో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారికి స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ పూట యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.