కలానికి సంకెళ్లు: జర్నలిస్టులు వాట్సాప్ గ్రూపులను సమాచారశాఖ వద్ద నమోదు చేసుకోవాలి
Recommended Video
లక్నో: మీడియాను నియంత్రించేందుకు ఉత్తర్ ప్రదేశ్ లలిత్ పూర్ జిల్లా పాలనాయంత్రాంగం పావులు కదిపింది. ఆ జిల్లాలోని జర్నలిస్టుల వాట్సాప్ గ్రూప్ వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్ర సమాచారాశాఖ వద్ద జర్నలిస్టులు తమ వాట్సాప్ గ్రూపులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. సమాచార శాఖ పోర్ట్ఫోలియో సీఎం ఆదిత్యనాథ్ దగ్గరే ఉంది. తమ వాట్సాప్ గ్రూపును రిజిస్టర్ చేసుకోని జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని పాలనాయంత్రాంగం హెచ్చరించింది.
"జిల్లాలోని జర్నలిస్టులు ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో ఆ వివరాలన్నీ జిల్లా సమాచార కార్యాలయంలోని అధికారి వద్ద సమర్పించాలి. వాట్సాప్ గ్రూప్కు అడ్మిన్గా ఉన్న వ్యక్తి గ్రూపులోని సభ్యులందరి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులకు సంబంధించిన ఆధార్ నంబరు, ఫోటోలు ఇతరత్ర డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి " అని డీఎం మన్వేంద్ర సింగ్, లలిత్పూర్ ఎస్సీ ఓపీ సింగ్ విడదుల చేసిన ఆదేశాల కాపీలో ఉంది. ప్రస్తుతం ఇది లలిత్ పూర్ జిల్లాకు మాత్రమే ఉంది. అయితే భవిష్యత్తులో ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని యూపీ సర్కార్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే... జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపునకు సంబంధించిన వివరాలు సమర్పించాలన్నది కేవలం స్థానికంగా మాత్రమే తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వం తరుపున నుంచి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ముఖ్యంగా సమాచారశాఖ నుంచి ఎలాంటి ఆర్డర్ జారీ చేయలేదని యూపీ సమాచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అవనీష్ అవాస్తి తెలిపారు. లలిత్ పూర్లో ఇలాంటి ఆదేశాలు ఏమైనా జారీ అయి ఉంటే అది కేవలం స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్ణయమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆరా తీస్తోందని అవనీష్ అవాస్తి వెల్లడించారు. ఇదిలా ఉంటే లలిత్పూర్ జిల్లా యంత్రాంగం మాత్రం ఆదేశాలు ఇచ్చామని అయితే ఇది మంచి ఉద్దేశంతోనే జారీ చేసినట్లు చెప్పుకొచ్చింది.
పాలనాయంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని... తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా తద్వారా హింస చెలరేగకుండా అణిచివేసేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ మన్వేంద్ర సింగ్ చెప్పారు. జర్నలిస్టుల పేరుతో ఎన్నో తప్పుడు వార్తలు వాట్సాప్ ద్వారా జోరుగా షికారు చేస్తున్నాయని దీని ద్వారా నష్టం వాటిల్లుతోందని మన్వేంద్ర సింగ్ తెలిపారు.
లలిత్పూర్ పాలనా విభాగం ఇచ్చిన ఆదేశాలపై నేషనల్ కన్వీనర్ ఆఫ్ సోషల్ మీడియా సెల్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడు విశ్వదియో రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు వార్తల ప్రచారమే జిల్లా యంత్రాంగానికి సమస్యగా ఉంటే... ఆ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తప్పితే... జర్నలిస్టులను వారి వాట్సాప్ గ్రూపులను సమాచారశాఖ వద్ద నమోదు చేసుకోవాలని చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలా చేయడమంటే స్వతంత్రంగా పనిచేసే మీడియాను ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకురావడమేనని అని విశ్వదియోరావు దుయ్యబట్టారు.