యూపీ-మోడీ: బీజేపీ గెలిస్తే ఏమౌతుంది, ఓడిపోతే ఏమౌతుంది?
అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి. దీంతో అందరి దృష్టి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ పైన పడింది. ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు
లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి. దీంతో అందరి దృష్టి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ పైన పడింది. ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.
యూపీ పైన అందరి దృష్టి ఉండేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అది పెద్ద రాష్ట్రం. బీజేపీ చాలా ఏళ్ల తర్వాత గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ పరువును నిలబట్టే ఎన్నికలు.
ముఖ్యంగా 2019 ఎన్నికలకు ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్. ఇందులో ప్రధాన రాష్ట్రం యూపీ. మోడీ ప్రచార బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు.
మోడీ మేనియాను తేల్చనున్నాయి
ఒక విధంగా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో మోడీ భవితవ్యాన్ని యూపీ ఎన్నికలు నిర్దేశించనున్నాయి. పైగా మోడీ మేనియా దేశంలో ఇంకా కొనసాగుతుందా.. లేదా బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారా అనే విషయంపై కూడా ఈ ఎన్నికల ఫలితాలు క్లారిటీ ఇవ్వనున్నాయి.
నోట్ల రద్దు తర్వాత..
నోట్ల రద్దు తర్వాత దేశంలో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలివి. బీజేపీపై, మోదీ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల అభిప్రాయమేంటో కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిచనుంది. ఇప్పటికే బీజేపీ గెలుపు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా దాదాపుగా బీజేపీకే అనుకూలంగా వచ్చే అవకాశముంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు ఫెయిలైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అసలు ఫలితం తేలే దాకా గెలుపెవరిదో చెప్పడం కష్టమే.
సవాళ్లేంటి?
యూపీలో బీజేపీ గెలిస్తే మోడీకి కలిసొచ్చే అంశాలేంటి? బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే ఎదుర్కోబోయే సవాళ్లేంటి? యూపీలో బీజేపీ విజయభావుటా ఎగరవేస్తే మోడీకి కలిసొచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ముఖ్యంగా మోడీ మేనియా. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మోడీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని తేలుతుంది.
కర్నాటక, ఈశాన్య రాష్ట్రాలపై ప్రభావం
మోడీ మేనియా ప్రచారం 2018లో జరగబోయే కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారనుంది. లోకసభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపనుంది. అంతేకాదు బీజేపీ యూపీలో గెలిస్తే రాజ్యసభ సభ్యుల సంఖ్యను పెంచేందుకు మోడీకి వీలుంటుంది. యూపీలో బీజేపీ గెలిస్తే మోడీ వ్యూహ రచన ఫలించినట్టే.
అన్ని వర్గాలు మోడీవైపే..
బీజేపీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యతనిస్తుందనే ఆరోపణ యూపీలో బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో మోడీ తన వ్యూహం మార్చారు. నాన్ యాదవ్ ఓబీసీలను, నాన్ జాతవ్ దళితులను తన వైపు తిప్పుకునేందుకు ఈ ఎన్నికల్లో ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కిందిస్థాయి వర్గాలు, పేద ప్రజలు మోడీ వెంటే ఉన్నారన్న సంకేతాన్ని ఇవ్వొచ్చు. ఇది పార్టీ యూపీలో మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.
ఓడిపోతే..
ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పార్టీపై పడుతుంది. మోడీ ఈ ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకుని, ప్రచారానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఇంత చేసినా ఇక్కడ బీజేపీ ఓడిపోతే మోడీ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. ఇన్నాళ్లకు మోడీ మేనియాతో నెట్టుకొచ్చిన పార్టీ కేడర్ అసంతృప్తికి లోనవడం ఖాయం.
వచ్చే లోకసభ ఎన్నికల్లోనూ ప్రభావం
పైగా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. యూపీలో బీజేపీ ఓడిపోతే మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని భావించవలసి ఉంటుంది. నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమీ లేదని, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి యూపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని విపక్షాలు చెప్పుకునేందుకు అవకాశముంటుంది.