అఖిలేష్ రిజైన్ ఆమోదం: తెరపైకి రామమందిరం.. మోడీ పరిష్కారం
యూపీలో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రామ్ నాయక్కు ఇచ్చారు. గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
లక్నో: యూపీలో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రామ్ నాయక్కు ఇచ్చారు. గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగాలని గవర్నర్ ఆయనకు సూచించారు.
యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ
అఖిలేష్ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత రాజ్ భవన్ వెళ్లారు. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాగా, యూపీలో 403 సీట్లకు గాను బీజేపీ 320కి పైగా స్థానాల్లో విజయ దుందుబి మోగించింది.
బీజేపీ గెలుపుపై శివసేన ఆనందం
యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం పట్ల శివసేన సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
తెరపైకి రామమందిరం
అదే సమయంలో రామ మందిర నిర్మాణం గురించి సంజయ్ రౌత్ ప్రస్తావించారు. త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో అకాలీ-బీజేపీ కూటమి ఓటమి చవిచూడడంపైనా ఆయన స్పందించారు. అక్కడి ప్రజలు మార్పును కోరుకున్నారని, ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు.
శివసేన - బీజేపీ
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన, బీజేపీ రెండు దశాబ్దాల తర్వాత వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అందులో కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన అత్యధిక సీట్లు సాధించి మేయర్ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ మద్దతు తెలిపింది.
రామమందిరానికి మోడీ పరిష్కారం
ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయంటే తాను నమ్మలేదని కేంద్ర మంత్రి ఉమాభారతి తెలిపారు. కానీ ఆరు నెలల క్రితం ప్రచారం ప్రారంభించినప్పుడు మాత్రం నమ్మడం ప్రారంభించానని తెలిపారు. ఈసారి 300 సీట్లకు పైగా వస్తాయని భావించానని తెలిపారు. అయోధ్య రామాలయం అంశాన్ని ఆయుధంగా చేసుకోలేదన్నారు.. దీనికి మోడీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటారని చెప్పారు.
రాజ్యసభకు లాభం
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యూపీలో 325 మంది గెలుపొందారు. ఉత్తరాఖండ్లో 70కి 57 కైవసం చేసుకొన్నారు. అటు గోవా, మణిపూర్లోనూ గణనీయ స్థానాలు గెలిచిన బీజేపీకి ఇక రాజ్యసభలో ఆధిపత్యం లభించే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో లాభం
పెద్దల సభలో మొత్తం స్థానాల సంఖ్య 250. లోకసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమికి 74 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీవి 56. ఇక కాంగ్రెస్కు ఉన్న బలం 59. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొంటే ఎన్డీయే ఆధిపత్యం చాలా తక్కువ. దీంతో లోకసభలో ఎలాంటి బిల్లు పెట్టినా వెంటనే ఆమోదం లభిస్తుండగా రాజ్యసభలో అడ్డంకులు కలుగుతున్నాయి.
ప్రతిష్టాత్మకం
రాజ్యసభలో రెండేళ్లకోసారి 1/3 వంతు మంది సభ్యులు దిగిపోతారు. అందుకే యూపీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. భారీ సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహం పన్నింది. అందులో విజయవంతమైంది. రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికిప్పుడే బలం పెరగదు కానీ రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ విజయం ఫలితాలు ఇవ్వగలదు.
2019కి ఆధిపత్యం
యూపీలో బీజేపీ అత్యధిక ఎమ్మెల్యేలను గెలిచినా రాజ్యసభలో 2019 వరకు పూర్తి ఆధిపత్యం చలాయించే అవకాశం లేదనే చెప్పవచ్చు. మొత్తం 31 రాజ్యసభ స్థానాలున్న ఆ రాష్ట్రం నుంచి ఈసారి దిగిపోయేది పదిమంది. అయిదే ఈ స్థానాలకు తిరిగి నిర్వహించే ఎన్నికల్లో బీజేపీ సభ్యులు గణనీయంగా పెరుగుతారు. ఇక 2019 లోపు 79 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ 23, కాంగ్రెస్ 21 నిలబెట్టుకుంటాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే స్థానాలు పెరుగుతాయి కాబట్టి పెద్దల సభలో బీజేపీ ఆధిపత్యం చలాయిస్తుంది.