మైనారిటీ కార్డే కీలకం: రేపు ఐదోదశ పోలింగ్
‘గంగా - జమునా’ తెహ్జీబ్కు ప్రతీకగా నిలిచిన ఫైజాబాద్, దానికి 20 కిలోమీటర్ల దూరంలోని అయోధ్య సహా 11 జిల్లాల పరిధిలోని 51 నియోజకవర్గాల పరిధిలో ఐదో దశ సోమవారం పోలింగ్ జరుగనున్నది.
లక్నో: 'గంగా - జమునా' తెహ్జీబ్కు ప్రతీకగా నిలిచిన ఫైజాబాద్, దానికి 20 కిలోమీటర్ల దూరంలోని అయోధ్య సహా 11 జిల్లాల పరిధిలోని 51 నియోజకవర్గాల పరిధిలో ఐదో దశ సోమవారం పోలింగ్ జరుగనున్నది. ఇప్పటికీ వివాదాస్పద బాబ్రీ మసీద్ - రామజన్మభూమి అంశం ఈ ప్రాంతంలో రాజకీయ ఎన్నికల నినాదంగానే సజీవంగా ఉన్నది.
దేశ విభజన తర్వాత ప్రత్యేకించి 1980వ దశకం ప్రారంభం నుంచి నవాబుల రాజధానిగా ఉన్నఅవధ్ రీజియన్లో అతివాద హిందు రాజకీయాలకు కేంద్రంగా మారింది. నాటి నుంచి అంతా రామజన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదాన్నే ఎన్నికల అస్త్రంగా మలిచారు. తద్వారా హిందుత్వ రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది.
32 స్థానాల్లో ఎస్పీ - కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు
బెహ్రాయిచ్, గొండా, శ్రావస్తి, బల్రామ్పూర్, అంబేద్కర్ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, అమేథి, సుల్తాన్ పూర్ జిల్లాల పరిధిలో సోమవారం పోలింగ్ జరుగనున్నది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ఈ జిల్లాలన్నీ హిందుత్వ సంప్రదాయ వాదులంతా సారథ్యం వహించారు. బాబ్రీమసీద్ కూల్చివేసిన తర్వాత 25 ఏళ్లకు కూడా ఈ రీజియన్లోని ప్రధాన పార్టీలు మైనారిటీ కార్డును ఉపయోగిస్తున్నాయి. తొలిసారి 52 నియోజకవర్గాల పరిధిలో ఎస్పీ - కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ 32 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడంతో మైనారిటీ కార్డును ఆ పార్టీలు ఎంతగా ఉపయోగిస్తున్నాయో అర్థమవుతూనే ఉన్నది.
అయోధ్య నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ముస్లిం
అయోధ్య నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజ్మీ సిద్ధిఖి మాట్లాడుతూ గంగా జమునా తెహజీబ్ కు తమ పార్టీ అసలు సిసలు నిర్వచనమని చెప్పారు. అయోధ్యలో ద్వేష పూరిత రాజకీయాలు తప్పనిసరిగా ఓటమి పాలవుతాయని స్పష్టం చేశారు. బహిరంగా మైనారిటీ కార్డు వాడడానికి నిదర్శనమన్న బిజేపి యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ మాట్లాడుతూ ఈ దఫా కుల, ప్రాంతీయ, మత ప్రాతిపదికన రాజకీయాలు చెల్లవని వ్యాఖ్యానించారు. ప్రగతే తమ ఎన్నికల నినాదమని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న నినాదం అందరినీ ఆకట్టుకున్నదని తెలిపారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్పై సందేహాలు
ప్రగతి, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటున్న బీజేపీ రాజకీయాలపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ ఎంపీ వినయ్ కతియార్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూపీలో బీజేపీ గెలుపొందడంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొనడం గమనార్హం. ఈ ప్రకటనే అవధ్ రీజియన్ ప్రాంతంలో ఓటర్లను పునరేకీకరణవైపు నడిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పునరేకీకరణ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఓటుబ్యాంకు రాజకీయాలు పనిచేస్తాయంటున్నారు. గోండా, శ్రావస్తి, బల్రాంపూర్, బెహ్రాయిచ్ జిల్లాల్లో మైనారిటీలు 19 శాతం ఓటర్లుగా ఉన్నారు. బీఎస్పీ, కాంగ్రెస్ - ఎస్పీ కూటమి కూడా ముస్లిం ఓట్లపైనే ప్రధానంగా ఆధార పడి రాజకీయాలు చేస్తున్నాయి.
సమర్థంగా హిందుత్వ రాజకీయం
దశాబ్దాల తరబడి హిందుత్వ రాజకీయం ఈ ప్రాంతంలో సమర్థవంతంగా ఉంది. గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని హిందు యువ వాహిని కూడా రంగంలోకి దిగడంతో బీజేపీ హిందువుల పునరేకీకరణపైన ద్రుష్టి సారించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2012 ఎన్నికల్లో 52 స్థానాలకు ఎస్పీ 37, కాంగ్రెస్, బీజేపీ చెరో ఐదు స్థానాలు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి. ఎస్పీ అభ్యర్థి మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల తొమ్మిదో తేదీన జరుగనున్నది.
గత విజయాలు పునరావృతమవుతాయా?
తాజా ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు గత ఎన్నికల విజయాన్ని పునరావృతం చేయడం ఆ పార్టీల నాయకులు రాహుల్, అఖిలేశ్ ముందు ఉన్న సవాల్. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావస్తి, బలరాంపూర్, సుల్తాన్ పూర్, అంబేడ్కర్నగర్ జిల్లాల్లో ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి పరిస్థితి త్రిముఖ పోరులో పొత్తు లాభంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎస్పీ ధీమాతో ఉంది. ఐదో దశలో పోటీచేస్తున్న తొమ్మిది మంది మంత్రులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
అమేథీలో దోస్తీమే సవాల్
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ స్థానం నుంచి ఇరు పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీ, రాజవంశీకుడు సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్, బీజేపీ నుంచి సంజయ్ మొదటి భార్య గరిమా సింగ్ పోటీపడుతున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి ఎస్పీ టికెట్పై బరిలో ఉన్నారు. అమేథి జిల్లాలోని మరో స్థానం గౌరిగంజ్లోనూ ఎస్పీ, కాంగ్రెస్లు పోటాపోటీగా అభ్యర్థులను నిలిపాయి.
భారీగానే ఆశలు పెట్టుకున్న మాయా
తమ ముస్లిం- దళిత ఫార్ములాపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఐదోదశలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో చాలాచోట్ల ముస్లిం, దళితులు కలిసి మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. బలరాంపూర్ జిల్లాలో 38 శాతం, బహ్రాయిన్ జిల్లాలో 36 శాతం, సిద్ధార్థ్నగర్ జిల్లాలో 30 శాతం ముస్లింలే. అందుకే ఈ దశలో 18 మంది ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని ఓడించగల స్థితిలో ఉన్న అభ్యర్థివైపు ముస్లింలు మొగ్గుతారని బీఎస్పీ ఆశిస్తున్నది.
ఐదోదశలో 168 మంది కోటీశ్వర్లు
మొత్తం 612 మంది అభ్యర్థుల్లో 27 శాతం మంది కోటీశ్వర్లు ఉన్నారు. వారిలో బీఎస్పీలో 43 మంది, బీజేపీ నుంచి 38, ఎస్పీలో 32, కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మందిలో ఏడుగురు, ఆర్ఎల్డీ నుంచి 30 మంది తొమ్మిది మంది అభ్యర్థులు కోటీశ్వర్లు, 220 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 14 కోటీశ్వర్లుగా ఉన్నారు. సగటున అభ్యర్థుల ఆదాయం 1.56 కోట్లుగా ఉన్నది. పార్టీల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులు కాంగ్రెస్ పార్టీలో రూ.4.40 కోట్లు, బీజేపీలో రూ.4.64, బీఎస్పీలో రూ.4.16, ఎస్పీలో రూ.3.48 కోట్లు, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో రూ.2.20 కోట్లు, స్వతంత్ర అభ్యర్థులు రూ.44.96 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు. వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో 117 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.