సతీమణుల మధ్య పొలిటికల్ ఫైట్
కొడుకులు, కూతుళ్లతోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకుల సతీమణులు కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.
న్యూఢిల్లీ: కొడుకులు, కూతుళ్లతోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకుల సతీమణులు కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనాగుప్తా కోడలు అపర్ణా యాదవ్ అందులో మొదటి వరుసలో నిలుస్తారు. అధికార సమాజ్ వాదీ పార్టీలో ముసలానికి ఆమె కేంద్ర బిందువు కావడమే గమనార్హం.
అఖిలేశ్ వారసత్వం పట్ల కినుక వహించిన సాధనాగుప్తా.. తన కోడలు అపర్ణను ముందు పెట్టి రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవాలని కన్న కలలు అడియాసలయ్యాయి. అఖిలేశ్ యాదవ్ రాష్ట్ర సీఎంగా కొనసాగడంతోపాటు ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో అసలు అపర్ణా యాదవ్కు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అఖిలేశ్ యాదవ్ పార్టీ పగ్గాలు తన చేతికి వచ్చిన తర్వాత ఎన్నికల ముంగిట.. తన వారికి పెద్దపీట వేయడానికి వెనుకాడలేదు.
అపర్ణ వర్సెస్ రీటా
ఎస్పీ తరఫున బరిలో నిలిచిన అపర్ణా యాదవ్ ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్నారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా పనిచేసిన రీటా బహుగుణ ఇటీవలే బిజెపిలో చేరారు. కానీ అపర్ణా యాదవ్ కు ఇంత వరకు రాజకీయ అనుభవం లేదు.
బాహ్ నుంచి మాజీ ఎస్పీ నేత అరిందామన్ సింగ్ భార్య
ప్రతి ఎన్నికల సమయంలోనూ వివిధ పార్టీల నాయకులు ఆయా పార్టీల వైఖరి, నిర్ణయాలు నచ్చక ఇతర పార్టీల్లో చేరడం సహజ పరిణామమే. ఏడాది క్రితం సమాజ్ వాదీ పార్టీని వీడి బిజెపిలో చేరిన రాజా అరిందామన్ సింగ్ తన భార్యకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆగ్రా జిల్లాలోని బాహ్ అసెంబ్లీ స్థానం నుంచి రాణి పక్షిలాఖా సింగ్ పోటీలో ఉన్నారు. ఇక జైదేవి బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ సతీమణి. ఈ దఫా ఎన్నికల్లో మలిహాబాద్ స్థానం నుంచి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అనురాగ్ యాదవ్ వర్సెస్ స్వాతిసింగ్
స్వాతి సింగ్.. బీజేపీ వివాదాస్పద నేత దయాశంకర్ సింగ్ సతీమణి. 2016లో బీఎస్పీ అధినేత మాయావతికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన భార్య స్వాతిసింగ్ బీజేపీ తరఫున లక్నో జిల్లాలోని సరోజినీ నగర్ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థి ములాయం సింగ్ యాదవ్ మేనకోడలు అనురాగ్ యాదవ్ కావడం గమనార్హం.
అమేథీ నుంచి గరిమా సింగ్ వర్సెస్ గాయత్రి ప్రజాపతి
అమేథీ రాజ వంశీయుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాజా సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్ ఈ దఫా అమేథీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి ఎస్పీ - కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి గాయత్రి ప్రజాపతి బరిలో నిలిచారు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్ ఓటమి పాలయ్యారు.
మేజా స్థానం నుంచి నీలం కార్వారియా
అలహాబాద్ జిల్లా మేజా అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎంపీ జవహర్ యాదవ్ హత్య కేసులో నిందితుడిగా జైలు పాలైన ఉదయ్ బాను భార్య నీలం కార్వారియా బిజెపి తరఫున పోటీలో ఉన్నారు.
ఆర్ఎల్డీ నుంచి మాఫియా డాన్ సంజీవ్ జెవా సతీమణి
ముఖ్తార్ అన్సారీ కుడిభుజంగా భావించే సంజీవ్ జెవా సతీమణి పాయల్ మహేశ్వరి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) టిక్కెట్ పై ముజఫర్ నగర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి నేత బ్రహ్మం దత్ ద్వివేది హత్య కేసులో సంజయ్ జెవా యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
ముహమదాబాద్ నుంచి బీజేపీ తరఫున అల్కారాయి
హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే క్రుష్ణానందరాయ్ భార్య అల్కారాయి బిజెపి తరఫున ముహమదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు.
అలహాబాద్ లో బీఎస్పీ అభ్యర్థిగా పూజా పాల్
హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ భార్య పూజా పాల్ అలహాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా.