వ్యూహం మార్చిన బిజెపి: స్కామ్ నుంచి కసబ్ వరకు..
మోదీ మొదలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమదైన శైలిలో రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు. తమ వైరిపక్షాలకు సరికొత్త నిర్వచనాలిస్తూ ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాలను శాసించే రాష్ట్రం యూపీ. రెండున్నరేళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో 80 స్థానాలకు 71 నియోజకవర్గాలను గెలుచుకున్నది బీజేపీ. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అవినీతికి అడ్డుకట్ట, నల్లధనాన్ని వెలికితీసే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేశామని ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ శ్రేణులు పదే పదే చెప్తూ వచ్చాయి.
కానీ నోట్ల రద్దు కారణంగా సామాన్యులు తాము కష్ట పడి సంపాదించిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల ముందు బారులు తీరారు. అలా బారులు తీరిన వారిలో పలువురు హఠాన్మరణం పాలవ్వడంతో పరిస్థితి తిరగబడింది. అంతకుముందు మైనారిటీలకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీరణకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ జరిపిన లక్షిత దాడులను ఉపయోగించుకోవాలన్నకమలనాథుల ఆశలు ప్రారంభంలోనే తేలిపోయాయి.
ఎందుకంటే అవి నిరంతరం ఆర్మీ జరిపే చర్యల్లో భాగమని కాంగ్రెస్ పార్టీ, మాజీ ఆర్మీ అధికారులు తేల్చి చెప్పడంతో ఆ కల అడియాసగా మారింది. దీంతో అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించిన కమలనాథులు.. ఓట్ల పునరేకీకరణకు విభజన రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్రమోదీ మొదలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమదైన శైలిలో రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారు. తమ వైరిపక్షాలకు సరికొత్త నిర్వచనాలిస్తూ ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నించారు.
‘స్కామ్’కు మారుపేరు ఎస్పీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతి
నల్లధనం వెలికి తీసేందుకు తాము పెద్దనోట్లను రద్దుచేస్తే అవినీతికి నిలయమైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ అధినేత మాయావతి తనపై ఎదురుదాడికి దిగారని వారంతా ‘స్కామ్' అనే పదానికి నిర్వచనంతో ప్రధాని నరేంద్రమోదీ యూపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘స్కామ్'లో ఎస్ అంటే సమాజ్ వాదీ పార్టీ అని, సీ అంటే కాంగ్రెస్ అని, ఎ అంటే అఖిలేశ్ అని, ఎం అంటే మాయావతి అని నిర్వచనం ఇచ్చారు. తద్వారా ఆ పార్టీలన్నీ అవినీతి పరులన్న ముద్ర వేశారు. స్కామ్లో ఎ అంటే అమిత్ షా అని, ఎం అంటే మోదీ అని అఖిలేశ్, రాహుల్ ధీటుగా సమాధానమిచ్చారు. మూడుసార్లు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మాయావతికి ‘స్కామ్'లో ఎలా వాటా కల్పించారని అఖిలేశ్ ప్రశ్నించారు.
అఖిలేశ్ పనితీరుపై ఇలా..
చిన్నవాడు సీఎంగా బాధ్యతలు చేపడితే ఉత్తర్ ప్రదేశ్ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని ఆశించానని, కానీ ఆ ఆశలు అడియాసలయ్యాయని అఖిలేశ్ యాదవ్పై నరేంద్రమోదీ వ్యంగ్యాస్త్రం సంధించారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, బీజేపీకి అధికారమిస్తే 14 ఏళ్లుగా రాష్ట్రానికి దూరమైన ప్రగతిని మళ్లీ ముందుకు తెస్తామన్న వాదం ముందుకు తెచ్చారు. కానీ రెండున్నరేళ్ల క్రితం లోక్సభ ఎన్నికల్లో ఉపాధి కల్పిస్తానని, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ రూ.15 లక్షల నగదు డిపాజిట్ చేస్తానని, తనకు అధికారం ఇస్తే మంచి రోజులు వస్తాయని ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే మరోసారి తమకు అధికారం ఇవ్వమని కోరిన మోదీకి అఖిలేశ్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే లక్నో మెట్రో రైల్ ట్రయల్ రన్, ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వే తదితర అభివ్రుద్ధి పనులకు శ్రీకారం చుట్టి ‘రాష్ట్ర ప్రగతి'పై తనదైన మార్కు వేసిన అఖిలేశ్.. ఈ పథకాలు ప్రగతి కాదా? అని ప్రశ్నించడంతో మోదీ నుంచి సమాధానం కరువైంది. ‘అచ్ఛేదిన్' నినాదం సంగతేమిటని యూపీ సీఎం నిలదీశారు. అంతే కాదు తమ ప్రభుత్వ పాలనపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రధాని మోదీ సహా కమలనాథులందరికీ సవాల్ విసిరి వారిని ఆత్మరక్షణలో పడేశారు.
తొలి రెండు దశల తర్వాత దూకుడు పెంచిన బిజెపి
పశ్చిమ యూపీలో 143 స్థానాల పరిధిలో ముస్లింల ఓట్లు చాలా కీలకం. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయ్యే వరకు సంయమనం పాటించినట్లు వ్యవహరించిన ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తర్వాత తమదైన శైలిలో ప్రచార పర్వంలో దూకుడు పెంచారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వివక్ష కొనసాగుతున్నదని మెలికలు పెట్టేందుకు ప్రధాని మోదీ పూనుకున్నారు. గ్రామంలో సమాధులు ఉన్నట్లే, శ్మశానవాటికలు కావాలని, ఈద్తోపాటు దీపావళికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కానీ యూపీలో అటువంటి వాతావరణం లేదని నేరుగా వివిధ సామాజిక వర్గాల మధ్య విభేదాలు తొలిదశలో ప్రగతి నినాదాన్ని ముందుకు తెచ్చిన మోదీ.. హిందుత్వ కార్డు బయటకు తీశారు. దీనికి తోడు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కొన్ని గణాంకాలు జత చేశారు. హిందూ ముస్లింలు 80 - 20 శాతంగా జనాభా ఉన్నదని ముస్లింల అభివ్రుద్ధికి చేపట్టిన పథకాల్లో సగం కూడా నిధులు కేటాయించలేదని వాస్తవాలు వెల్లడిస్తే తప్పేమిటని ఎదురుదాడికి దిగారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల సామాజిక, రాజకీయ పునరేకీకరణే లక్ష్యంగా వివక్షా పూరిత రాజకీయాలకు తెర తీశారు.
విద్యుత్ సరఫరాపై యూపీ సీఎం ఇలా..
దీంతో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ చెలరేగిపోయారు. ‘మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతున్నదా? లేదా? అన్న సంగతి మీరు పవిత్రంగా భావించే గంగానది సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలి' అని సవాల్ చేశారు. ‘మన్ కీ బాత్' పేరిట ఉత్తుత్తి కబుర్లు చెప్పడం తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదని ఎదురుదాడికి దిగారు. అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి అలహాబాద్లో జరిగిన బహిరంగ సభలో 1980వ దశకంలో బిగ్ బి అమితాబ్ నటించిన ‘లావారీస్' సినిమాలో ఆయన పాడిన ‘మేరే అంగనే మే తుమార్హా క్యా కామ్ హై' అనే పాట అందుకుని ‘మా ఇంట్లో మీకేం పని' అని మరీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
బెహన్జీ సంపత్తి పార్టీ అని..
మూడవ, నాల్గవ ఫేజ్ల్లో మాయావతి లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం సాగింది. బీఎస్పీ అంటే బెహన్జీ సంపత్తి పార్టీ అని ఎద్దేవాచేశారు. బీఎస్పీ ఖాతాలో వందల కోట్ల నిల్వలెక్కడివని మోడీ ప్రశ్నించారు. ఆమె సోదరుడి ఖాతాలో అదే స్థాయిలో డబ్బులెక్కడివని నిలదీశారు. ఆమె భారీ స్థాయిలో డబ్బులు సంపాదించడమే లక్షంగా రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాయావతి కూడా అంతకు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. దళితులంటే ప్రధాని మోదీకి వ్యతిరేకత అని, తమ పార్టీ కార్యకర్తలు చిన్నమొత్తాల్లో విరాళాలు సేకరిస్తే తప్పేమిటని నిలదీశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ముందుగా ఉద్యమ సంస్థగా మొదలైన తర్వాతే బీఎస్పీ రాజకీయ పార్టీ అవతారమెత్తిందని గుర్తుచేశారు.
కసబ్పై అమిత్ షా ఇలా..
‘కసబ్ - కాంగ్రెస్ (క), సమాజ్ వాదీ పార్టీ (స), బీఎస్పీ (బ్)' నుంచి విముక్తి పొందితేనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రగతి సాధ్యమని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా సరికొత్త వివాదాన్ని ముందుకు తెచ్చినా.. అఖిలేశ్, మాయావతి కూడా అసలు సిసలు కసబ్ ‘అమిత్ షా'యేనని ప్రతిదాడికి దిగారు. ఇక సమాజ్ వాదీ పార్టీలో నాయకత్వ ఆధిపత్యం కోసం తండ్రి ములాయం సింగ్ యాదవ్ను ఎదిరించిన సీఎం అఖిలేశ్ యాదవ్తో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందన్నారు. అంతేకాదు 1980ల్లో తండ్రి ములాయం హత్యకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీతో అఖిలేశ్ ఎలా పొత్తు పెట్టుకున్నారంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకు విఫల యత్నం చేశారు. తాను గుజరాత్ నుంచి యూపీకి వచ్చిన దత్త పుత్రుడినని, తన తల్లిదండ్రుల వంటి ఉత్తరప్రదేశ్ను వదులుకోలేనని పేర్కొన్నారు.
రుణ మాఫీపై మోదీ ఉద్దేశాలు వేరన్న రాహుల్
ఎస్పీ చీఫ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్, ఎస్పీ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపీకి దత్తపుత్రులు అక్కర్లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నామని, తాము చేపట్టిన ప్రగతిదాయక పథకాలే అందుకు నిదర్శనమని అఖిలేశ్ తేల్చేశారు. దత్త పుత్రుడినని ప్రకటనలు చేస్తే కాదని, ప్రజలతో అనుబంధ బాంధవ్యాలు పెట్టుకుంటేనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అచ్ఛేదిన్ తీసుకొస్తానని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. షోలేలో గబ్బర్ సింగ్ లా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే క్యాబినెట్ ఆమోదిస్తే సరిపోతుందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కానీ మోదీ ఉద్దేశాలు భిన్నంగా ఉన్నాయని, ఎన్నికల్లో గెలుపొందడమే ఆయన లక్ష్యం తప్ప ప్రజల ప్రయోజనాల పరిరక్షణేమీ ఆయనకు పట్టవని స్పష్టం చేశారు.